టీటిడీపిలో రేవంత్ రెడ్డి చిచ్చు: చంద్రబాబు ప్లాన్ తిరగబడుతుందా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయి. ఓటుకు నోటు కేసులో నిందితుడైన శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా తెలంగాణలో పార్టీకి ఊపు తేవాలనే చంద్రబాబు ప్రయత్నాలు బెడిసికొట్టే అవకాశం ఉందని అంటున్నారు. బుధవారంనాడు జరిగిన సంఘటననే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
రాష్ట్రమంతా తిరగడానికి హైకోర్టు అనుమతించడంతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. రావడమే దూకుడుగా వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఎప్పటిలాగే దూకుడుగా ప్రకటనలు చేశారు. తాను హైదరాబాదు రావడమే కెసిఆర్కు గుండె దడ పుట్టిస్తుందనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. సింహానికి భయపడి కెసిఆర్ చైనా పారిపోయారని వ్యాఖ్యానించారు.
కెసిఆర్పై రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం తమకు తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు. ఆయనపై పెట్టిన కేసును రాజకీయ కుట్రగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం ద్వారా రేవంత్ రెడ్డిని కెసిఆర్ను ఎదుర్కునే తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాలని ఆయన భావిస్తూ ఉండవచ్చు. కెసిఆర్ కుట్ర చేశారనే టిడిపి ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు ఏ మేరకు స్వీకరిస్తారనేది ప్రశ్నగానే ఉంటుంది.
ఆ విషయాన్ని అలా పక్కన పెడితే, ఎవరినీ పట్టించుకోకుండా, ఎవరినీ ఖాతరు చేయకుండా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి కారణంగా సీనియర్ నాయకులు పార్టీకి దూరమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లోకి వెళ్లారు. ఉన్నవారు అంటీ ముట్టునట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిజానికి, బుధవారం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నాయకులు టిడిపిలో చేరాల్సి ఉంది. ఈ కార్యక్రమం ముందే ఖరారైంది. అయితే, రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా వచ్చేసి చేరికల కార్యక్రమాన్ని ముగించేశారు. అయితే, ఈ కార్యక్రమానికి టిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్లమెంటు సభ్యుడు సిహెచ్ మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్ రావాల్సి ఉంది. కానీ వారెవరూ రాలేదు. ఎల్బీ నగర్ నియోజకవర్గం సిహెచ్ మల్లారెడ్డి పార్లమెంటు నియోజకవర్గంలోకి వస్తుంది. ప్రకాష్ గౌడ్ జిల్లా పార్టీకి నేతృత్వం వహిస్తారు.
ఎల్బీనగర్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఆర్. కృష్ణయ్య మన్సూరాబాద్ గుండా వస్తున్న ర్యాలీ వద్దకు వచ్చి పార్టీలోకి వస్తున్న వారికి స్వాగతం పలికి అటు నుంచి అటే వెళ్లిపోయారు. వీరెవరూ రాకపోవడాన్ని రేవంత్ రెడ్డి పట్టించుకున్నట్లు లేదు. ఆయనకు ఆ అవసరం కూడా లేదు. కెసిఆర్పై పోరాటం చేసే నాయకుడిగా తనను ప్రజలు ఆదరిస్తారని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు కూడా అదే ఆశిస్తూ ఉండవచ్చు. రేవంత్ రెడ్డి ఇలాగే కెసిఆర్ను ఎదుర్కుంటే చాలు, తెలంగాణలో టిడిపి బలపడుతుందని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్కు మరింత ఎక్కువగా ఆశలు ఉండవచ్చు. అది ఎదురు తిరిగే ప్రమాదమే ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.