'కేసీఆర్ కుటుంబం పైనా సీబీఐ విచారణ తప్పదు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన రాజకీయ నిర్భయ కేసు పెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలను, ఎమ్మెల్యేలను బెదిరించి, వారి ఆస్తులు, వ్యాపారాలపై దాడులు చేసి అక్రమ కేసులు బనాయిస్తూ తెరాసలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు.
శాసన సభలో ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యేకు మండలి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదన్నారు. అయినా ఓటర్ల జాబితాలో చేర్చడం దగదన్నారు. తెరాసకు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆ పార్టీ ముగ్గురు ఎమ్మెల్సీలనే గెలుస్తుందన్నారు.
మరో 3 సీట్లు మిగిలిపోతాయని, అలాంటప్పుడు ఐదుగురు తెరాస అభ్యర్థులను ఎలా పోటీలో నిలబెడతారన్నారు. కేసీఆర్ కుటుంబం పైన సీబీఐ విచారణ తప్పదని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావులు కరీంనగర్లో అన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్ హైదరాబాదులో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలతో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కవిత, కేటీఆర్, హరీష్ రావులు సీబీఐ విచారణ ఎదుర్కొనక తప్పదన్నారు.