4 రోజుల్లో అంతా చెప్పేశా, ఇక ఏం లేదు: హైకోర్టుకు రేవంత్, గవర్నర్కు వివరించిన కేసీఆర్
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను నాలుగు రోజుల ఏసీబీ కస్టడీలో అన్ని విషయాలను చెప్పానని, ఇక చెప్పడానికి ఏమీ లేదని అందులో పేర్కొన్నారు.
రాజకీయ కుట్రలో భాగంగానే తనను ఇరికించారన్నారు. అన్ని వివరాలు చెప్పానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. రేవంత్ రెడ్డితో పాటు అరెస్టైన ఉదయ్ సిన్హా, సెబాస్టియన్లు కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వవద్దని ఏసీబీ కౌంటర్ దాఖలు చేయనుంది.
చంద్రబాబుతో మరోమారు పోలీసు బాసుల భేటీ

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పోలీసు బాసులు మరోసారి సోమవారం భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారం చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఆయన పోలీస్ బాసులతో చర్చోపచర్చలు జరుపుతున్నారు.
సోమవారం ఏపీ డీజీపీ జేవీ రాముడు సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఓటుకు నోటు వ్యవహారంపై సమీక్షిస్తున్నారని సమాచారం. ఆదివారం ఏసీబీ డీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్ తదితరులతో భేటీ అయిన విషయం తెలిసిందే.
ఓటుకు నోటుపై గవర్నర్ కు వివరించిన కేసీఆర్

సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు గవర్నర్ నరసింహన్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుపై ఆధారాలు లభించాయని, ఆయనకు నోటీసులు ఇచ్చే విషయమై గవర్నర్కు సమాచారం ఇచ్చేందుకే కలుస్తున్నారనే ఊహాగానాలు వినిపించాయి.
కేసీఆర్ తాజా పరిణామాలపై గవర్నర్కు చెప్పారని తెలుస్తోంది. ఓటుకు నోటు వ్యవహారాన్ని పూర్తిగా వివరించారని సమాచారం.

కాగా, ఫోరెన్సిక్ నివేదికలు ఆడియో టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబుదేనని ఏసీబీకి నివేదిక ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. స్టీఫెన్ సన్ వాంగ్మూలం అనంతరం మరింత వేడెక్కనుంది.












Click it and Unblock the Notifications