పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన రేవంత్
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవల తన అరెస్టు విషయంలో పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్ రావు, నార్సింగి ఇన్స్పెక్టర్ గంగాధర్ను చేరుస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో డ్రోన్ చిత్రీకరణ ఆరోపణలపై రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 41ఏ నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్లో పేర్కొన్నారు. ఏడేళ్లలోపు శిక్ష ఉండే కేసుల్లో 41ఏ నోటీసు ఇచ్చిన తర్వాత అవసరమైతే అరెస్ట్ చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారని తెలిపారు.
డ్రోన్తో చిత్రీకరించారన్న ఆరోపణలతో తనపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలియగానే.. స్వయంగా వెళ్లి 41ఏ నోటీసు ఇస్తే వివరణ ఇస్తానని కోరినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయినప్పటికీ తనకు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
తనను జైలుకు పంపించే ఉద్దేశంతోనే తనకు సంబంధం లేని కేసులను కూడా రిమాండ్ నివేదికలో ప్రస్తావించారన్నారు. అరెస్ట్ చేసే ముందు 41ఏ నోటీసు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి హైకోర్టును కోరారు.