ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. అధిష్టానం పిలుపు.. ఎందుకంటే!!
తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ సీఎం ను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర సీఎం గా రేవంత్ రెడ్డికి పట్టం కట్టనుంది. మొదటి నుండి అధిష్టానం రేవంత్ రెడ్డి విషయంలో సానుకూలంగా ఉంది. అనేక చర్చల మధ్య, ఉత్కంఠల మధ్య రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది.
సీఎంగా పేరు ప్రకటించక ముందే రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. అనంతరం కేసీవేణుగోపాల్ రేవంత్ రెడ్డినే సీఎం అంటూ ప్రకటన చేశారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేయాల్సిన పనులను గురించి పార్టీ నాయకులతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి ఉన్న ఫళంగా రావాలని అధిష్టానం పిలుపునిచ్చింది.

దీంతో రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటన చెయ్యటంతో ఆయనకు సెక్యూరిటీ మరింత పెంచారు. ఆయన ఇంటి వద్ద కూడా భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ఢిల్లీలోని కేసి వేణుగోపాల్ నివాసంలో చర్చల్లో పాల్గొన్నారు. డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే తదితరులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ఆపై చర్చల అనంతరం రేవంత్ రెడ్డి సీఎం అని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే రేవంత్ రెడ్డి అధిష్టానం పిలుపు మేరకు బేగం పేట ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈ రోజు రాత్రికి ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను కలిసి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీతో పాటు తన ఎంపికకు సహకరించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపి వారితో భేటీ కానున్నారు.
రేపు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి వచ్చిన తర్వాత ఎల్లుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. ఈరోజు రాత్రి ఢిల్లీలో పెద్దలతో భేటీలో మంత్రి వర్గ ఏర్పాటుపై ఆయనతో అధిష్టానం చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications