హరీష్ చుట్టూ ఇంటెలిజెన్స్, ఖబడ్దార్ కెసిఆర్: ఊగిపోయిన రేవంత్ (పిక్చర్స్)
మెదక్: కన్నతండ్రికి అన్నం పెట్టని నేత భూపాల్ రెడ్డికి ఓటేయమని టిఆర్ఎస్ చెప్పడం సిగ్గుచేటని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం విమర్శించారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్లో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.
ఈ నేపథ్యంలో టీడీపీ బుధవారం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. నారాయణ్ ఖేడ్లో టీఆర్ఎస్కు కేడర్ లేదన్నారు. సిద్ధిపేట నుంచి నాయకులను తీసుకు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
హరీశ్ రావును కేసీఆర్, కేటీఆర్ నగర బహిష్కరణ చేశారని, అర్ధరాత్రో, అపరాత్రో హరీశ్ రావు హైదరాబాద్ వస్తాడని, ఆయన చుట్టూ ఇంటిలిజెన్స్ పని చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తలకెక్కిన నిషా దిగేలా ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. హరీశ్ పంచే డబ్బులు తీసుకుని టీడీపీకే ఓటు వేయాలన్నారు.
గ్రేటర్లో రేవంత్ రెడ్డి ప్రచారం
కెసిఆర్, కెటిఆర్.. సీమాంధ్ర ప్రజల జోలికి వస్తే కళ్లు పీకేస్తామని, ఖబడ్డార్ అంటూ రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో హెచ్చరించారు. ఆయన మాదాపూర్ డివిజన్ టిడిపి అభ్యర్థి ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్తో కలిసి రోడ్డు షోలో పాల్గొన్నారు. పనికిరాని ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న నీచ రాజకీయం కెసిఆర్ది అన్నారు. పదవిలో ఉన్న తలసాని పదవి ఊడిన తర్వాత సికింద్రాబాదులో ఆలుగడ్డలు అమ్ముకుంటారని, నాయిని నర్సింహా రెడ్డికి పదవి ఊడితే లేపేవారే కరువు అవుతారన్నారు.
పదవులు వదులుకుంటా: హరీష్ రావు సవాల్
మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలో తెరాస ఓడిపోతే కనుక తన తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని నిలదీశారు.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలు చేతకాకపోతే నోరు మూసుకోవాలన్నారు. అవాకులు చవాకులు పేలవద్దని హితవు పలికారు. ఓటమి భయంతోనే వారు ఈ విధంగా మాట్లాడుతున్నారన్నారు.
తెలంగాణ మోసపోయింది: కాంగ్రెస్
కేసీఆర్ చేతిలో తెలంగాణ ప్రజలు మోసపోయారని కాంగ్రెస్ శాసనసభా పక్షనేత జానారెడ్డి విమర్శించారు. తెరాస నియంతృత్వ పోకడలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు నశిస్తున్నాయన్నారు. నారాయణఖేడ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి నామపత్రం దాఖలు సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తున్న కేసీఆర్కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కేసీఆర్ దగాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.