రైతులు చస్తున్నా అందాల పోటీలలో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ఫైర్
ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతన్నల కష్టం మాత్రం తీరడం లేదు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, పంటలు పండించి ధాన్యపు రాశులను మార్కెట్ కు తరలించిన సకాలంలో కొనుగోలు చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క అకాల వర్షాలు, ఓ పక్క మండుటెండలు అన్నదాతలను విలవిలలాడేలా చేస్తున్నాయి.
వడదెబ్బకు రైతు మృతి
మళ్లీ అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. అంతేకాదు కొంతమంది అన్నదాతలు పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ కు వెళ్లి వడ దెబ్బతో మృతి చెందుతున్న ఘటనలు కూడా బాధను కలిగిస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ధాన్యపు కుప్ప పైనే వడదెబ్బతో మృతి చెందాడు.

రేవంత్ రెడ్డి చేసిన హత్య అన్న కేటీఆర్
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన గుగులోతు కిషన్ అనే రైతు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ ఘటన పైన బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చేసిన హత్య అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?
వడదెబ్బలు, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం అందాల పోటీలలో మునిగి తేలుతున్నాడని కేటీఆర్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకర పరిస్థితి అని ఆయన అన్నారు. ఇది ముమ్మాటికీ రేవంత్ రెడ్డి చేసిన హత్య అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించిన ఆయన ప్రజలలో కూడా ఈ సందేహం పెరుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డికి సోయి ఉంటే ఆ పని చెయ్యాలి
వడదెబ్బతో కాదు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గుగులోతు కిషన్ కుటుంబం తమ కుటుంబ పెద్దను కోల్పోయిందని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి సోయి ఉంటే కొనుగోలు కేంద్రాలలో పేరుకుపోయిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఆ పని చేయకపోతే రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం బలికాక తప్పదు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications