మున్నాభాయి ఆర్ఎంపీ: లక్ష్మారెడ్డిపై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విద్యార్హతలపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న విద్యార్హతలపై తనకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.
అంతేగాక, అనుమతి లేని కళాశాలలో చేరితే డాక్టర్ ఎలా అవుతారో వెల్లడించాలని రేవంత్ డిమాండ్ చేశారు. గుల్బర్బా విశ్వవిద్యాలయం అంటూ ఓ సారి.. హైదరాబాద్ కర్నాటక విశ్వవిద్యాలయంలో చదివానని మరోసారి చెప్పారని.. అసలు ఎది నిజమో తెలియడం లేదని అన్నారు.
లక్ష్మారెడ్డి.. ప్రాక్టీస్ ఎక్కడ?
1981లో వైద్య విద్య కోసం అడ్మిషన్ తీసుకున్న లక్ష్మారెడ్డి 1988లో పాసయ్యానని చెప్పారని... అప్పటి వరకు ఆయనేం చేశారో చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలోని ఆవంచ ప్రాంతంలో ప్రాక్టీస్ చేసిన లక్ష్మారెడ్డి ఇందుకోసం రాష్ట్రంలో ఎక్కడ నమోదు చేసుకున్నారో కూడా వెల్లడించాలన్నారు.
సంపత్ రావు లక్ష్మారెడ్డి క్లాస్మెటే
నమోదు చేసుకుంటే సంబంధిత పత్రం విడుదల చేయాలని కోరారు. లక్ష్మారెడ్డి తరఫున హైదరాబాద్ కర్ణాటక విశ్వవిద్యాలయ హోమియోపతి కళాశాల ప్రిన్సిపల్ సంపత్ రావు వకాల్తా పుచ్చుకున్నారని.. ఆయన కూడా లక్ష్మారెడ్డి క్లాస్మేటేనని రేవంత్ తెలిపారు.
ఆంతర్యం ఏమిటి?
2015లోనే లక్ష్మారెడ్డికి సంబంధించిన విద్యార్హతల సమాచారం ఆర్టీఏ కింద సమాచారం అడిగినా స్పందించని సంపత్ రావు.. లక్ష్మారెడ్డి తమ కళాశాలలో చదివారని మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
మున్నాభాయి ఆర్ఎంపీ
మిడ్జిల్ సభా వేదిక పైనే తన పైన, తన కుటుంబ సభ్యులపైన వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతవరకు సమంజసమని మంత్రిని ప్రశ్నించారు. లక్ష్మారెడ్డి మున్నాభాయ్ ఆర్ఎంపీ అంటూ రేవంత్ ఎద్దేశా చేశారు. తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని రేవంత్ స్పష్టం చేశారు.