కేసీఆర్ అడుక్కున్నా.. జనం స్పందించలేదు: రేవంత్ ఎద్దేవా
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. వరంగల్లో జరిగిన టీఆర్ఎస్ సభ పేవలంగా సాగిందని అన్నారు. అంతేగాక, ఎన్నిసార్లు చప్పట్లు కొట్టాలని కేసీఆర్ అడిగినా జనం నుంచి స్పందన కరువైందని రేవంత్ ఎద్దేవా చేశారు.
ఎప్పుడూ చెప్పినట్లే గొర్రెలు.. చేపలు.. కరెంటు ముచ్చట్లు తప్ప కేసీఆర్ ప్రసంగంలో ప్రజలను ఆకర్షించే అంశాలేవీ లేవన్నారు. రైతుల ఆత్మహత్యల గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు.
రెండు పడకగదుల ఇళ్లు, దళితులకు భూమి, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ విద్యా పథకాలను ఎందుకు ప్రస్తావించలేదన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎందుకు ప్రసంగించలేదో కేసీఆర్ చెబితే బాగుంటుందని రేవంత్రెడ్డి చురకంటించారు.
ఖమ్మం పర్యటన
శనివారం ఖమ్మం జిల్లాలో రేవంత్రెడ్డి పర్యటించనున్నారని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి రేపు జిల్లాకు రానున్నారని, మిర్చి రైతుల ఆందోళనలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.