ఇది కట్టుబానిసత్వం...వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రి హరీష్ రావుకు రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని, ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని చెబుతున్న కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు లేఖ రాశారు.

మంత్రి హరీష్ రావుకు రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఇటీవల ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు రోగిని కొరికిన ఘటనను పోస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి హరీష్ రావు ని ఇంతకుముందే టార్గెట్ చేసిన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా నిమ్స్ కాంట్రాక్టు నర్సుల డిమాండ్ల పరిష్కారం కోసం మంత్రి హరీష్ రావు కు లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన పది రోజులుగా నిమ్స్ లో ఒప్పంద కార్మికులు ఆందోళన చేపట్టారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

నిమ్స్ కాంట్రాక్ట్ నర్సులతో పని కట్టుబానిసత్వం కిందకు వస్తుంది
సీనియార్టీ ఆధారంగా తమను పర్మినెంట్ చేయాలని, ప్రస్తుతమున్న జీతాలతో కుటుంబాలు నెట్టుకు రావడం కష్టంగా మారిందని జీతాలు పెంచాలని, ఆరు నెలల మెటర్నటీ లీవ్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నిమ్స్ కాంట్రాక్ట్ నర్సులు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్న రేవంత్ రెడ్డి నర్సుల డిమాండ్లను హరీష్ రావు పెడచెవిని పెట్టడం దుర్మార్గమని వెల్లడించారు. నిమ్స్ కాంట్రాక్టు నర్సులకు ప్రసూతి సెలవులు, వేతన పే స్లిప్పులు ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్న ఆయన, ఇది కట్టుబానిసత్వం కిందకు వస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణమే హరీష్ రావు వారితో చర్చలు జరపాలి
తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఆయన కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వెనుకడుగు వేయకుండా నర్సులు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. హరీష్ రావు స్వయంగా వెళ్లి వారితో చర్చలు జరపాలని లేఖలో పేర్కొన్న రేవంత్ రెడ్డి, నర్సుల కనీస డిమాండ్లను పరిష్కరించాలంటూ తన లేఖ ద్వారా మంత్రి హరీష్ రావు కు విజ్ఞప్తి చేశారు. నర్సులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించటం దారుణం అని పేర్కొన్నారు.

నిమ్స్ లో 423మంది కాంట్రాక్ట్ నర్సులు .. డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు
నిమ్స్ ఆస్పత్రిలో దాదాపు 12 సంవత్సరాల నుంచి 423 మంది నర్సులు కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ప్రస్తుతం 36 మంది గర్భిణీ మహిళలు ఉన్నారు. వీరంతా తమను పర్మినెంట్ చేయాలని, తమ వేతనాలను పెంచాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావుకు రేవంత్ రెడ్డి వారి సమస్యలు పరిష్కరించాల్సిందిగా లేఖ రాశారు.












Click it and Unblock the Notifications