కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ! ఢిల్లీ నుంచి హైదరాబాద్కు స్పెషల్ టీం
తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ భేటీలో.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, పేదల గృహ నిర్మాణాలపై చర్చ సాగింది.
కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్' (PMAY-G) కింద మొదటి విడతగా తెలంగాణకు రెండు లక్షల ఇళ్లను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన 11.56 లక్షల మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించాల్సి ఉందని, గతంలోనే ఇచ్చిన వినతిపత్రం ఆధారంగా మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా త్వరగా మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరారు.

ఎల్నినో దెబ్బ.. ప్రత్యామ్నాయ ప్రణాళికలు!
రాష్ట్రంలో ఎల్నినో కారణంగా వర్షపాతం తగ్గడం, ఫలితంగా బోర్లకు డిమాండ్ పెరిగి వ్యవసాయ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిన తీరును కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. తాగు నీరు, సాగుకు విద్యుత్ కొరత రాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలను వివరిస్తూ, కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, రాష్ట్రంలో సన్న బియ్యం సాగు చేసే రైతులకు రూ.500 బోనస్ అందిస్తున్నామని, పండించిన బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పేదలకు అందిస్తున్నామని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన 250 ఎకరాల కూరగాయలు, పండ్ల మార్కెట్ గురించి ప్రస్తావిస్తూ.. పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించేందుకు కేంద్రం మద్దతు నిలవాలని కోరారు.
దక్షిణాది పరిస్థితులకు తగ్గట్టుగా ప్రత్యేక వ్యవసాయ విధానం!
అనంతరం విలేకరులతో మాట్లాడిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఢిల్లీలో కూర్చుని దేశం మొత్తానికి ఒకే వ్యవసాయ విధానాన్ని రూపొందించలేమని, ప్రాంతీయ వాతావరణం, మృత్తికలకు అనుగుణంగా ప్రణాళికలు అవసరమని స్పష్టం చేశారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్లో ప్రాంతీయ వ్యవసాయ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం దక్షిణాదిలోనే ఎక్కువగా ఉందని, వర్షాభావ జిల్లాల కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రబీ సీజన్ కోసం విత్తనాలు, సేంద్రీయ వ్యవసాయం, నకిలీ పురుగుమందుల కట్టడి, నూనె గింజలు, ఆయిల్ పామ్ సాగు పెంపుపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
