నాగార్జున ఎన్కన్వెన్షన్ ఆక్రమణలపై చర్యలేవీ?: రేవంత్, హరీశ్ వివరణ
హైదరాబాద్: సినిమా నటులు అందరికీ ఆదర్శంగా ఉండాలని, కానీ కొందరు అలా ఉండటం లేదని తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ కోసం ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం జరిగిందని అన్నారు. ఇదంతా అక్రమంగా ఆక్రమించుకున్నదేనని చెప్పారు.
ఈ ఆక్రమణపై ప్రభుత్వం స్పందించడం లేదు, నాగార్జున కూడా స్పందించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి పలు ప్రశ్నలను లేవనెత్తారు.

అంతేగాక, ములుగు డివిజన్లో జరిగిందని, అది ప్రభుత్వ దృష్టికి వచ్చిందా? లేదా? అని ప్రశ్నించారు. ఫేజ్ 1,2లలో ఎన్ని చెరువులను పూర్తి చేశారని ప్రశ్నించారు. కాగా, ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకున్న అక్రమాలపై చర్యలేవని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నించారు.
ఎన్ కన్వెన్షన్ హాల్.. జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది
ఎన్ కన్వెన్షన్ హాల్ ఆక్రమణలపై రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఎన్ కన్వెన్షన్ హాల్ జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఈ అంశంపై మున్సిపల్ శాఖ మంత్రి, జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. అవసరమైన చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 169 చెరువులు ఉన్నాయని చెప్పారు.
అవినీతిని సహించం: వచ్చే ఏడాది మూడో దశ
కాగా, మిషన్ కాకతీయలో అవినీతిని సహించే ప్రసక్తే లేదని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మూడో దశ పనులు చేపడతామని చెప్పారు. చెరువుల పునరుద్ధరణ ఉద్యమ ఆకాంక్ష అని చెప్పారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎం అయిన తర్వాత మిషన్ కాకతీయ చేపట్టడం జరిగిందని తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమైన కార్యక్రమం మిషన్ కాకతీయనేని ఆయన అన్నారు. మెదక్ జిల్లాలో 15.1శాతం భూగర్భజలాలు పెరిగాయని, వర్షాలు తక్కువ కురిసిన కారణంగా మహబూబ్నగర్ జిల్లాలో అతితక్కువగా జలాలు పెరిగాయని అన్నారు. తెలంగాణలోని అన్ని చోట్లా చెరువుల పునరుద్ధరణ జరుగుతుందని అన్నారు.
ఫేజ్ 3లో చెరువుల్లో చాలా చోట్ల నీళ్లు ఉండటంతో ఎస్టిమేషన్ కొంచెం కష్టమైందని చెప్పారు. ఎక్కువగా వర్షాలు పడని ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఫేజ్ 3లో ప్రాధాన్యమిస్తామని చెప్పారు. నీళ్లున్న చెరువుల్లో కూడా ఫేజ్ 3లో స్థానముంటుందని చెప్పారు.
రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటే కొత్త చెరువుల నిర్మాణాలు కూడా చేపడతామని అన్నారు. చింతల్ బోరీ చెరువు కోసం రూ. 7.4కోట్లు జారీ చేశామని చెప్పారు. పనులు పూర్తవడంతో ఇప్పుడు ఆ చెరువు కింద రెండు పంటలు పండుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడే వరకు చెరువుల వివరాలే లేవని, అందుకే జియోట్యాగింగ్ తీసుకొచ్చామని తెలిపారు.
కేసీఆర్ ఆదేశాలతో 15రోజుల్లో చెరువులను గుర్తించామని తెలిపారు. ఆన్లైన్లో సమాచారం ఉంచేందుకే జియో ట్యాగింగ్ చేస్తున్నామని తెలిపారు. దీంతో చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాక, చెరువులు విస్తీర్ణం, ఆ చెరువు కింద ఎంత మేర పంటలు పండుతాయని దానిని, తదితర అంశాలను తెలుసుకునేందుకు ఇస్రోతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. వారం పదిరోజుల్లో అన్ని చెరువులను జియో ట్యాగింగ్ చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications