బీజేపీతో టీఆర్ఎస్, బాబుకు శత్రువే!: తెలంగాణలో టీడీపీతో పొత్తుపై రేవంత్ ఏమన్నారంటే?
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు పరచని ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతి నివేదనసభ పెట్టలేరని అన్నారు.
బుధవారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ... దేవుడు దిగి వచ్చినా సెప్టెంబర్ 2న 'ప్రగతి నివేదిక సభ' నిర్వహించడం కేసీఆర్కు సాధ్యం కాదని అన్నారు. అంతేగాక, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఎవరూ సభకు రారని.. సభ విజయవంతం కాదని నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి తెలిపాయని చెప్పారు.

అందుకే ముందస్తు నాటకం
ఆగస్టు 15 కల్లా ఇంటింటికీ నల్లా నీరు అందిస్తానని చెప్పిన సీఎం హమీ అమలు కాలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రి తదితర హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సమస్యలపై ప్రజల దృష్టి మరల్చేందుకు, పార్టీలో తిరుగుబాటు నుంచి బయటపడేందుకు కేసీఆర్ ముందస్తు ఎన్నికల నాటకం ఆడుతున్నారని విమర్శించారు.

బీజేపీతో కలిసి కేసీఆర్..
అసెంబ్లీలో ఎంఐఎంతో కలిసి వెళ్లాలని, ఆ తర్వాత ఎంఐఎంను పక్కన బెట్టి బీజేపీతో కలిసి లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆరోపించారు. జమిలి ఎన్నికలంటున్న ప్రధాని మోడీ.... తెలంగాణలో అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు ఎలా సహకరిస్తారని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ చంద్రబాబుకు శత్రువే..
బీజేపీతో కలిసే వాళ్లు, లోపాయికారి ఒప్పందాలు చేసుకునే వాళ్లు తమకు శత్రువులని చంద్రబాబు ప్రకటించారని... ఆయన మాటల ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్ వారికి శత్రువని తేలిపోయిందన్నారు. ఇక మిత్రులెవరన్నది తేలటానికి కొంత సమయం పడుతుందన్నారు.

టీడీపీ-కాంగ్రెస్తో పొత్తుపై..
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం కావడంతో ఏ చేయాలో పాలుపోక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదనే అసత్య ప్రచారానికి టీఆర్ఎస్ నేతలు దిగుతున్నారని, అది వారి దిగజారుడుతనమని రేవంత్ అన్నారు. తెలంగాణలో టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటుందని, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని రేవంత్ చెప్పారు.












Click it and Unblock the Notifications