రేవంత్ రెడ్డికి సన్నిహిత మిత్రుడే: కత్తులు దూశాడు, ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ రేవంత్ రెడ్డికి సన్నిహిత మిత్రుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారిద్దరితో పాటు మరో తెలుగుదేశం నేత దూళిపాళ్ల నరేంద్ర
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ రేవంత్ రెడ్డికి సన్నిహిత మిత్రుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారిద్దరితో పాటు మరో తెలుగుదేశం నేత దూళిపాళ్ల నరేంద్ర కూడా ఎప్పుడూ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతుండేవారు.
తాజా పరిణామాలు పయ్యావుల కేశవ్కు, రేవంత్ రెడ్డికి మధ్య వైరాన్ని పెంచాయి. రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఇద్దరు వేర్వేరు రాష్ట్రాల్లో ఉండిపోయారు. వారిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
ఇటీవల రేవంతరెడ్డి చేసిన వ్యాఖ్యలు వారి మధ్య స్నేహానికి గండికొట్టినట్లే ఉన్నాయి. పయ్యావుల కేశవ్ మేనల్లుడితో కలిసి పరిటాల సునీత కుమారుడు కలిసి తెలంగాణలో బీర్ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారనేది రేవంత్ చేసిన వ్యాఖ్య. అది ఇరువురి మధ్య చిచ్చు పెట్టింది.
పయ్యావుల ఘాటుగా
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో రేవంత్ తనపై చేసిన ఆరోపణలపై పయ్యావుల కేశవ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. బార్కు లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తే అందరికీ ఇచ్చారని, ఇది తన మేనల్లుడు ఒక్కరికే ఇవ్వలేదని ఆయన చెప్పారు. అందులో తాను భాగస్వామిని కూడా కాదని అన్నారు.
తేడానే తెలియదు....
బార్కు, బీర్ల ఫ్యాక్టరీకి మధ్య తేడా తెలియని వ్యక్తి రేవంత్రెడ్డి అని తాను అనుకోవడం లేదని కేశవ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో తమ మధ్య స్నేహం గురించి కూడా పయ్యావుల ప్రస్తావించారు. అయితే, దానికి రేవంత్ రెడ్డి నుంచి స్పందన రాలేదు. కానీ వారి మధ్య పొన్నూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర సంధి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు వద్ద మాట్లాడుకుందామని...
ఆరోపణలు విరమించుకోవాలని, చంద్రబాబు వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని నరేంద్ర సూచించారు. ఆయన ఇరువురితో మాట్లాడినప్పటికీ రేవంత్, కేశవ్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వివాదం పెద్దదయ్యింది. మిత్ర ధర్మాన్ని రేవంత్ పాటించలేదని పయ్యావుల వ్యాఖ్యానించారు. పైగా ఆరు నెలల నుంచి ఢిల్లీలో రేవంత్ ఎవరెవరిని కలుస్తున్నారో తన దగ్గర సమాచారం ఉందని ఆయన రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుమార్తె కవితతో కలిసి ఓ కంపెనీని రిజిస్టర్ చేయించారని ఆరోపించారు.
పయ్యావుల ఇలా...
తెలుగుదేశం పార్టీలో పీకేగా పేరొందిన పయ్యావుల కేశవ్ నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా బ్యాక్ ఆఫీసులో కీలకపాత్ర పోషించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆరు నెలల నుంచి ఆయన నియోజకవర్గానికి, హైదరాబాద్ కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడూ అమరావతి వచ్చినప్పటికీ ఇటీవల నంద్యాల ఉప ఎన్నిక, ఆ తర్వాత రేవంత్ రెడ్డి వివాదంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.