ఇదేనా తెలంగాణా మోడల్? ఫాంహౌస్ సీఎం.. డమ్మీ హోంమంత్రి: విరుచుకుపడిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను, హోం మంత్రి మహమూద్ అలీని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతున్న రేవంత్ రెడ్డి తాజాగా మరోమారు ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకుంటున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఇదేనా అంటూ అనేక అంశాలను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.
బంగారు తెలంగాణాలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఇలా
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల దుస్థితిని తెలియజేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా, కుభీర్ మండలం , సాంవ్లీ గ్రామ పాఠశాల దుస్థితి ఇది అంటూ పేర్కొన్నారు. బంగారు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉన్నాయంటూ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పోస్ట్ చేసిన వీడియోలో చుట్టూ తడికలు కట్టి ఉన్న ఒక చావిడిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ ఒకే దగ్గర కూర్చొని, అక్కడి విద్యార్థులకు కింద నేలపై పరదా వేసి దానిపై కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న పరిస్థితిని చూపించారు. ఇక ఇదేనా తెలంగాణ మోడల్? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఆడబిడ్డలపై అఘాయిత్యాలు.. ఫాంహౌస్ సీఎం, డమ్మీ హోం మంత్రి సమీక్ష కూడా చెయ్యరా?
మరొక ట్వీట్ లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూలలా ప్రతిరోజూ ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు. సీఎం సొంత పార్టీ, తొత్తు పార్టీనేతల కొడుకుల ఆగడాలకు ఆడపిల్లలు బలి అవుతున్నారని మండిపడ్డారు. ఇంతటి దారుణాలు జరుగుతున్నా ఫాంహౌస్ సీఎం, డమ్మీ హోం మంత్రి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం అంటూ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేవలం గత రెండు వారాల్లో మహిళలు, బాలికలపై జరిగిన అత్యాచారాలకు సంబంధించిన ఓ పోస్టర్ ని షేర్ చేసిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి అని అసహనం వ్యక్తం చేశారు. ఇంకా తెలంగాణ రాష్ట్రం గురించి గొప్పలు దేనికి చెప్పుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కెసిఆర్ పాలనలో విఫలమయ్యారు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బాసర విద్యార్థుల సమస్యలపైనా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
అంతకు ముందు బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల చేస్తున్న ఆందోళన పై కూడా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. బాసర ఐఐఐటి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలనే ప్రయత్నం చేస్తే హైదరాబాద్ నుండి బాసర వరకు పోలీసులతో అరెస్టులకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో పరిస్థితి ఈ విధంగా ఉంటే కెసిఆర్, కేటీఆర్ తమ పాలన గురించి గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఆయన సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు.