మల్కాజిగిరిలో నేను గెలవాలంటే మీ అవసరం కావాలి: వారి గడప తొక్కిన రేవంత్ రెడ్డి, ఆ నేత హామీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరాచకత్వ పాలనపై పోరాడాలంటే, ఆయన పాలన అంతం కావాలంటే కామ్రేడ్లు అవసరమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం అన్నారు. తాను పోటీ చేయబోయే మల్కాజ్గిరి లోకసభ స్థానంలో సీపీఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. వారి మద్దతు ఉంటే తప్పకుండా గెలుస్తానని చెప్పారు.
మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా, టీఆర్ఎస్తో చర్చలు?
మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి గెలుపు కోసం సీపీఐ కృషి
రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం సీపీఐ రాష్ర్ట కార్యాలయం మఖ్దూం భవన్కు వెళ్లారు. తనకు మల్కాజిగిరిలో మద్దతివ్వాలని ఆ పార్టీ నేతలను కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని రేవంత్ తమను కోరారని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. మల్కాజ్గిరిలో సీపీఐ నాయకులంతా రేవంత్ గెలుపు కోసం కృషి చేస్తారని చెప్పారు. బీజేపీ హఠావో అని పార్టీ కేంద్ర కమిటి ఇచ్చిన పిలుపులో భాగంగా తాము లౌకిక శక్తులకు మద్దతిస్తున్నామన్నారు. బీజేపీని ఓడించాలి, తెరాసను ఓడిచాలనే నినాదంతో ముందుకెళ్తామన్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఓ జోకర్
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అరాచకత్వానికి మోడీ, కేసీఆర్ బొమ్మా బొరుసులాంటి వారని చెప్పారు. బీజేపీ చేసిన పనులన్నింటికి కేసీఆర్ మద్దతిచ్చారని, ఇప్పుడు నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారన్నారు. జాతీయ రాజకీయాలు కేసీఆర్కు అవసరం లేదని, సినిమాలో గచ్చిబౌలి దివాకర్ క్యారెక్టర్లా ఆయన జాతీయ రాజకీయాల్లో ఓ జోకర్ అన్నారు. కేసీఆర్, మోడీలు ఒకే తాను ముక్కలన్నారు. ఢిల్లీలో మోడీని, ఇక్కడ కేసీఆర్ను ఓడించాలంటే కమ్యూనిస్టుల సహకారం అవసరమని చెప్పారు. కేసీఆర్కు వేసే ప్రతి ఓటు మోడీకి వేసినట్లే అన్నారు.
కేసీఆర్కు వింత రోగం
16 ఎంపీ స్థానాల్లో గెలిస్తే తాను ఏదో సాధిస్తానని కేసీఆర్ చెబుతున్నారని, మరి ఇంతకుముందు 12 సీట్లు ఇస్తే ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ ఎంపీల్లో నంది ఎల్లయ్య మినహా అందరూ కేసీఆర్ కనుసన్నుల్లోనే పని చేశారన్నారు. అప్పుడు ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్కు ఓటేస్తే ఢిల్లీలో మోడీకి అమ్ముకుంటారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తమ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకుంటూ కేసీఆర్ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. పూర్తి మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వింత రోగంతో బాధపడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. అందుకే సంఖ్యాబలం ఉన్నప్పటికీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని విమర్శించారు.