మీ పాలనపై ఏం అధ్యయనం చెయ్యాలి కేటీఆర్: రేవంత్ రెడ్డి రివర్స్ ఎటాక్
తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో, రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రానున్న నేపథ్యంలో రాహుల్ గాంధీని స్టడీ టూర్కి మేము స్వాగతిస్తున్నామని మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ తెలంగాణాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి నేర్చుకుంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆయన తెలంగాణలోని ఉత్తమ రైతు స్నేహపూర్వక పద్ధతులను నేర్చుకుంటారని, కాంగ్రెస్ పాలిత విఫలమైన రాష్ట్రాల్లో వాటిని అమలు చేయడానికి కృషి చేస్తారని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ పర్యటనను టార్గెట్ చేశారు. ఇక రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న కేటీఆర్ కు రేవంత్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మీ పాలనపై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్ అంటూ ప్రశ్నించిన రేవంత్ రెడ్డి అనేక పశ్నలు సంధించారు.
రుణమాఫీ హామీ ఎలా ఎగగొట్టాలి? ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి? మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు ఎలాబిగించాలి? వరి,మిర్చీ,పత్తి రైతులు ఎలా చస్తున్నారు? ఇలాంటివి అధ్యయనం చేయాలా అంటూ ప్రశ్నించారు. ఇవే కదా నిజాలు. ఆ నిజాలు మరింత గట్టిగా చెప్పాడానికే రాహుల్ వస్తున్నారని రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా రివర్స్ ఎటాక్ చేశారు. అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్ చేయడం పైన కూడా రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
ట్విట్టర్ పిట్ట తోకముడిచింది. ప్రశ్నను చూసి గజగజ వణికింది. ప్రజల తరపున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్ చేశారు అంటూ పేర్కొన్నారు. ఒక జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ను బ్లాక్ చేయడం కేటీఆర్ మానసిక స్థితికి అద్దం పడుతోందని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.