నాపై కక్ష సాధించుకోవచ్చు: కెసిఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కావాలంటే తన పైన కక్ష సాధించుకోవచ్చునని, కానీ తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టకుండా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆదివారం నాడు శాసన సభలో అన్నారు.
రాజకీయంగా తనపై కక్షసాధించాలనుకుంటే తనకు అభ్యంతరంలేదని చెప్పారు. కానీ, అభివృద్ధి పనులు చేపట్టకుండా కొడంగల్ నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గం కోడంగల్లోని కోస్గీ మండలంలో బస్ డిపో నిర్మాణం కోసం సొంతంగా భూమి కొని ఇచ్చానని చెప్పారు.
నిర్మాణానికి రాజ్యసభ ఎంపీ కోటా నుంచి రూ.కోటి నిధులు ఇప్పించినా ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభించలేదన్నారు. ఇది సరికాదని అభిప్రాయపడ్డారు. తన పైన రాజకీయ కక్షతో నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దన్నారు.

ప్రభుత్వం 24 జిల్లాలు చేస్తానంటోందని, దీనివల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. రాష్ట్రంలోఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలనే పరిధిగా తీసుకొని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్నారు.
వీణవంక కేసుపై సభలో గందరగోళం
కరీంనగర్ జిల్లా వీణవంకలో ఫిబ్రవరి నెలలో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఆదివారం శాసన సభలో చర్చకు వచ్చింది. ఈ కేసులో పోలీసులు సత్వరమే స్పందించలేదనే ఆరోపణలు ఆదివారం తెలంగాణ శాసనసభలో విస్తృతంగా చర్చకు దారి తీశాయి.
ఉదయం సి విరామం అనంతరం ఈ కేసుపై హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఒక ప్రకటన చేశారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్న విజ్ఞప్తిని పరిశీలిస్తున్నామని, ఈ సంఘటనలో ఒక ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేయడంతోపాటు ఒక సీఐకి ఛార్జిమెమో ఇచ్చామన్నారు.
ప్రకటన అనంతరం కాంగ్రెస్ సభ్యులు జీవన్ రెడ్డి వివరణ కోరేందుకు లేవగా సభాపతి అనుమతించలేదు. ప్రకటన పూర్తయ్యాక మళ్లీ చర్చకు సభా నియమాలు అనుమతించవని స్పీకర్ స్పష్టం చేశారు. కాని కాంగ్రెస్ సభ్యులు వివరణ కావాల్సిందేనని పట్టుబడ్డారు. అనంతరం వారు సభ నుంచి వాకౌట్ చేశారు. సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications