హుజురాబాద్ ఫలితాలు: ఒక్క ఉపఎన్నికతో కాంగ్రెస్ భవిష్యత్ నిర్దేశించలేరు; రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలలో కారు జోరుకు బ్రేక్ వేసి కమల వికాసం కొనసాగింది. టిఆర్ఎస్ పార్టీపై బిజెపి రికార్డు మెజారిటీతో విజయం సాధించింది. చాలా టఫ్ ఫైట్ ఇచ్చిన ఈటల రాజేందర్ చివరకు టిఆర్ఎస్ పార్టీ దూకుడుకు కళ్లెం వేశారు. ఇదిలా ఉంటే హుజురాబాద్ ఉప ఎన్నికలో పేలవమైన ప్రదర్శన కనబర్చిన కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి గురైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ఓటమిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క ఉపఎన్నికతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ను నిర్దేశించలేరు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఈ ఓటమికి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని తేల్చి చెబుతున్నారు. గతంలో నాగార్జున సాగర్, దుబ్బాక కంటే దారుణంగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఓటమిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ఫలితాలకు తాను బాధ్యత వహిస్తానని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఒక్క ఉప ఎన్నికతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును నిర్దేశించలేరని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఓటమి గెలుపుకు దారులు వేస్తుందన్న రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఆత్మస్థైర్యంతో ఉండాలని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆలస్యంగా అభ్యర్థిని నిలబెట్టినా వెంకట్ ఊరూరు తిరిగే వాడని, బల్మూర్ వెంకట్ భవిష్యత్తులో బలమైన నాయకుడిగా ఎదుగుతాడని,రేపటి నుంచే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున తన సేవలు అందిస్తాడని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యుద్ధం జరిగినప్పుడు గెలిచిన రాజు రాజ్యం పాలిస్తాడని ఓడిపోయిన వాళ్లు బానిసలు అవుతారు అనేది రాచరిక పాలనలో జరిగిందని, కానీ ఇది రాచరికం కాదని, ప్రజాస్వామ్యమని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఓటమి గెలుపుకి దారులు వేస్తుందని తేల్చి చెప్పారు.
ఈ ఓటమి మరింత కసి పెంచుతుందన్న రేవంత్ రెడ్డి
కష్టపడి పని చేసే ఓపిక, సహనం తనకు ఉన్నాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి పార్టీ కోసం ముందుకు వెళ్లాలని ఈ ఓటమి త్వరలో మరింత కసి పెంచుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికలు ప్రత్యేక సందర్భంలో జరిగాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి భవిష్యత్తులో అన్ని వివరాలు, అంశాలను వివరంగా తెలియజేస్తామన్నారు. గులాబీ చీడ వదులుతుందని రేపటి నుంచి జనంలోకి వెళ్తామని తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను నిరాశ చెందవద్దని పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తాను గెలిస్తే పొంగిపోయేది లేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు అంటూ తేల్చి చెప్పారు .
ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని భవిష్యత్ కార్యాచరణ
రేవంత్ రెడ్డి తనకు ప్రజల పక్షాన మాట్లాడే ఓపిక, వయసు రెండు తనకు ఉన్నాయని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను నూటికి నూరు శాతం కాపాడుకుంటామని వెల్లడించారు. కార్యకర్తలకు అండగా తానున్నానని పేర్కొన్న రేవంత్ రెడ్డి భవిష్యత్తులో నిబద్ధతతో, పట్టుదలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తేల్చి చెప్పారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని భవిష్యత్ కార్యాచరణ తో ముందుకు వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Recommended Video
ఉప ఎన్నిక ఫలితానికి బాధ్యత మాదే
2018 ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం లో బిజెపికి 1673 ఓట్లు మాత్రమే వచ్చాయని, కానీ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఎన్నికల్లో బిజెపి డిపాజిట్లు కోల్పోయిందని అంతమాత్రాన ఆ పార్టీ మూసేసింది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మిగతా పార్టీలు 10 బంగ్లాలు కట్టింది లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితానికి తానే బాధ్యుడిని అంటూ తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఈ ఎన్నికలలో ఓటమి ఇచ్చిన కసితో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని తేల్చి చెప్పారు.