కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. మునుగోడు ఉపఎన్నికపై తగ్గేదేలేదట!!
కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పరోక్షంగా మండిపడ్డారు. తెలంగాణ కోసం కొట్లాడతాం అని చెప్పుకునే కొందరు ముసుగు వీరులు తమ ఆర్థిక లావాదేవీల కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీనే అవమానిస్తున్నారని మండిపడ్డారు. తమ అవసరాల కోసం మోడీ, అమిత్ షా విసిరిన ఎంగిలి మెతుకుల కోసం, కాంట్రాక్టుల కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు.

మోడీ, అమిత్ షాల దగ్గర కొందరు కాంట్రాక్ట్ లు చేసుకుంటున్నారు: రేవంత్ రెడ్డి
కొంతమంది కాంగ్రెస్ పార్టీ పాలిట విశ్వాసఘాతకులుగా మారారని మండిపడ్డారు. ఇక సోనియాగాంధీని ఈడీ వేధిస్తుంటే, కొంతమంది నాయకులు మోడీ, అమిత్ షా ల దగ్గరికి వెళ్లి కాంట్రాక్టులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ ప్రతినిధిగా, మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి గెలిపించారని, అలాంటి సోనియా గాంధీని అవమానించి, వారి పక్కన చేరిన వారిని ఉపేక్షించేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

కుక్క బిస్కెట్ల కోసం మోడీ, అమిత్ షా పంచన చేరారు
తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఓడిపోయినా రాష్ట్రం ఇచ్చిందని, అటువంటి ఆమెను మరిచిపోయి రాజకీయ కక్షలతో అవమానిస్తున్నారని మండిపడ్డారు. పోరాటం చేయాల్సింది పోయి కుక్క బిస్కెట్ల కోసం మోడీ, అమిత్ షా పంచన చేరారని , కాంగ్రెస్ తో ఉన్న పేగుబంధం తెగిపోయిందని రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక గతంలోలా వ్యవహారాలు ఉండవు అని తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పోరాటానికి రెడీ అయ్యిందని వెల్లడించారు.

ఈ నెల 5వ తేదీన మునుగోడులో కాంగ్రెస్ నేతలతో సమావేశం
ఈ నెల 5వ తేదీన మునుగోడులో కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ఈ సమావేశంలో తనతోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా పాల్గొంటారని స్పష్టం చేశారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు అందరూ మునుగోడు చేరుకొని అక్కడి ప్రజలను కలుసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇదే సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారంటూ తేల్చి చెప్పారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యత ఉందన్న రేవంత్ రెడ్డి
ఇదే విషయాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా స్పష్టం చేశారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మునుగోడు నియోజకవర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని పేర్కొన్న ఆయన మునుగోడు నియోజకవర్గంలో గెలుపు కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి చేస్తారని స్పష్టం చేశారు. ఈనెల 5వ తేదీ నుండి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పార్టీ రంగంలోకి దిగుతుంది అని వచ్చే ఉప ఎన్నికకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి సమరానికి సై అన్నారు.












Click it and Unblock the Notifications