కేసీఆర్ సంతకం రైతులకు మరణశాసనం, మిల్లర్లతో కలిసి దోపిడీ: రేవంత్ రెడ్డి ఫైర్
న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్, బీజేపీలు రాజకీయ రాక్షస క్రీడకు తెరలేపాయన్నారు. ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేయకుండా రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు.
కేసీఆర్ సంతకంతో రైతులకు మరణశాసనం: రేవంత్ ఫైర్
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని, అలా సీఎం చేసిన సంతకం రైతుల పాలిట మరణ శాసనంగా మారిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతులు కష్టపడి పండించిన పంటను కొనే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పలేదా? అని ప్రశ్నించారు.
మిల్లర్లతో కుమ్మక్కై కేసీఆర్ దోపిడీ: రేవంత్ రెడ్డి
మిల్లర్లతో కేసీఆర్ కుటుంబసభ్యులు కుమ్మక్కు అయ్యారని, ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు మిల్లర్లకు అమ్ముతున్నారని రేవంత్ ఆరోపించారు. మిల్లర్లకు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని అన్నారు. రూ. 1960కి కొనాల్సిన వడ్లను కేవలం రూ. 1400కే కొనుగోలు చేస్తున్నారని రేవంత్ తెలిపారు. కేంద్రం మద్దతు ధరకు వరికి ప్రకటించిందా? లేక బియ్యానికి ప్రకటించిందా? అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లు కొని రైతులను ఆదుకోవాల్సిందేనని రేవంత్ స్పష్టం చేశారు.
కేంద్రమే ధాన్యం కొన్నా.. తానే కొన్నట్లు కేసీఆర్ చెప్పుకున్నారు: మురళీధర్ రావు
ఇది ఇలావుండగా, బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మురళీధర్ రావు మీడియాతో మాట్లాడారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీఆర్ఎస్ ధాన్యం అంశాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఇన్నాళ్లు ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కొన్నట్లు చెప్పుకోలేదా? అని నిలదీశారు. కేంద్రంపై నిందలు వేసి రైతుల్లో వ్యతిరేకత పెంచే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని ఒప్పుకుని సంతకం చేశారో లేదో టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమలకు ప్రోత్సహిస్తామని కేంద్రానికి హామి ఇచ్చారని.. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మురళీధర్ రావు. ఇప్పటికైనా కేసీఆర్, టీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.