ఎర్రబెల్లి వల్లే జైలుకు పోయా: మిత్రద్రోహి అంటూ రేవంత్ రెడ్డి సంచలనం
హైదరాబాద్: తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎర్రబెల్లి శత్రువులతో చేతులు కలిపి తనకు ద్రోహం చేయడం వల్లే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఎర్రబెల్లి శత్రువులతో చేతులు కలిపి తనకు ద్రోహం చేయడం వల్లే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని రేవంత్ అన్నారు. ఎర్రబెల్లి మిత్ర ద్రోహి అని విమర్శించారు.
పాలకుర్తి జిల్లాలో 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్రావు ఏకచత్రాధిపత్యం వహించారు. ఈ పాలకుర్తిలో 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పని చేశారు. ఈ ఐదేళ్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న దయాకర్ రావు వందల మంది సర్పంచ్లు ఆందోళనలు, ఆత్మహత్యలు చేసుకుంటే.. ఏమాత్రం పట్టించుకోవాలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఈరోజు వందల మంది సర్పంచ్లు ముఖ్యంగా లంబాల తండాలలో, ఆదివాసీ గూడెలలో ఆత్మహత్యలు చేసుకుంటే ఆ సర్పంచ్లకు బిల్లులు ఇచ్చిన పాపాన పోలేదని రేవంత్ ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలో రూ.360 కోట్లతో ప్రారంభించిన రిజర్వాయర్.. ఇవాళ రూ.700 కోట్లకు పెంచి రూ.250 కోట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు దోచుకున్నారని ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకర్రావు దోచుకుంటుంటే.. రాజేందర్రెడ్డి కుటుంబం దానధర్మాలు చేశారని రేవంత్ చెప్పుకొచ్చారు.
40 ఏళ్ల క్రితం డీలర్గా ఉన్న దయాకర్రావు.. డాలర్ దయాకర్గా ఎలా మారారని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. రేషన్ డీలర్గా జీవితం ప్రారంభించిన ఆయనకు వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అలాగే అమెరికాలో పెట్టుబడులు ఎలా వచ్చాయో ప్రజలు ఆలోచించాలని రేవంత్ కోరారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.












Click it and Unblock the Notifications