ఈటెల నిజాలు, కేసీఆర్ అడగవేం: రేవంత్, తెలంగాణకు మోడీ నో చెప్పారు!
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్పై తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జీఎస్టీపై వాస్తవాలు చెబుతున్న ఈటెలను అభినందిస్తున్నానని అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్పై తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జీఎస్టీపై వాస్తవాలు చెబుతున్న ఈటెలను అభినందిస్తున్నానని అన్నారు.
జీఎస్టీ వల్ల రాష్ట్రంపై అదనపు భారం పడే అవకాశముందని, జీఎస్టీ వల్ల ఎరువులు, విత్తనాల ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రాన్ని డిమాండ్ చేయాలి
జీఎస్టీ నష్టాన్ని కేంద్రం భరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిమాండ్ చేయాలని రేవంత్ అన్నారు. లేకపోతే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వొద్దని సూచించారు. జీఎస్టీ ఆరంభ కార్యక్రమాన్ని బహిష్కరించాలని కోరారు. నోట్ల రద్దు సమయంలోనూ తొందరపడి సమర్థించారని, రైతులు ఇప్పటికీ నగదు కోసం అవస్థలు పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నగదు కోసం అవస్థలు పడుతున్నారన్నారు.
జిఎస్టీలో సామాన్యులు వాడే పదార్థాలపై పన్నులు తక్కువ
అంతకుముందు, మంత్రి ఈటెల మాట్లాడారు. పన్ను వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో ఎన్నో రకాల పన్నులున్నాయని తెలిపారు. జీఎస్టీ సన్నద్ధతపై ఈటెల అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో వసూలయ్యే పన్ను రాబడిలో కేంద్రానికి 50 శాతం వెళ్తుందన్నారు. సామాన్యులు వాడే ఆహార పదార్థాలపై పన్నులు తక్కువ ఉంటాయన్నారు. జీఎస్టీలో లోపాలను ఎప్పటికపుడు గుర్తిస్తూ ప్రతికూలతలను తొలగిస్తామన్నారు.
కేంద్రం కొన్ని ఒప్పుకుంది.. మరిన్నింటిపై నో
హైదరాబాద్లో సేవా పన్ను రాబడి ఎక్కువగా ఉంటుందని ఈటెల చెప్పారు. వ్యాపారులకు ఇబ్బందులు కలిగితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చునని, టోల్ ఫ్రీ నంబర్ 18004253787కి ఫోన్ చేసి ఫిర్యాదులు, సలహాలు చెప్పాలని సూచించారు. జీఎస్టీతో రాష్ట్ర ప్రభుత్వం, సామాన్యులపై భారం ఉండొద్దని కేంద్రాన్ని కోరగా.. కేంద్రం కొన్నింటిని ఒప్పుకుని, మరికొన్నింటిని తోసిపుచ్చిందన్నారు. ట్రేడర్స్ ప్రజల్లో భయాందోళనలు కలిగించొద్దని సూచించారు. చేనేత, గ్రానైట్, బీడీ పరిశ్రమపై పన్ను వద్దని కోరినట్లు వెల్లడించారు.
అందుకే తెలంగాణకు నష్టం భర్తీ చేయరు
6 అంశాల మీద అభ్యంతరాలు తెలుపుతూ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసినట్లు ఈటెల తెలిపారు. ఆహార పదార్థాలపై జీఎస్టీ ఉండదన్నారు. జీఎస్టీలో ఇప్పటికే 82 శాతం వ్యాపారులు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 7వేల మంది ట్రేడర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు 1.70 లక్షల మంది ట్రేడర్స్ నమోదు చేసుకున్నారని తెలిపారు. కొత్తగా 25 వేల మంది ట్రేడర్స్ నమోదు చేసుకునే అవకాశముందన్నారు. జీఎస్టీ నమోదుకు జులై 5 వరకు అవకాశముందని, 14 శాతం లోపు వృద్ధిరేటు ఉన్న రాష్ట్రాలకే జీఎస్టీ నష్టాన్ని భర్తీ చేస్తారని తెలిపారు. తెలంగాణ వృద్ధి రేటు 17.9 శాతం ఉన్నందున నష్టాన్ని భర్తీ చేయరన్నారు.