కవిత వ్యాఖ్యలతో మెలిక పెట్టిన రేవంత్ రెడ్డి.. సిట్ ఆ పని చేయాలంటూ డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్టు రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని మొదలైన రగడ, కెసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను బిజెపిలో చేరాలని ఒత్తిడి తెచ్చారని కెసిఆర్ చేసిన ప్రకటనతో మరింత హాట్ హాట్ గా మారింది. ఇక తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాష్ట్రంలోనూ షిండే మోడల్ అమలు చేద్దామని బీజేపీ నేతలు తనను సంప్రదించారని చేసిన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది.
కవిత వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి డిమాండ్
ఇక తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా తెలంగాణ సమాజం గమనిస్తున్న సమయంలో రెండు పార్టీల మధ్య జరుగుతున్న వివాదం నేపథ్యంలో టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కవిత వ్యాఖ్యలతో ఆసక్తికరమైన మెలిక పెట్టారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని బీజేపీ పై ఆరోపణలు చేస్తూ ముగ్గురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి కవిత తాజా వ్యాఖ్యలతో సంచలన డిమాండ్ చేశారు.
కవిత స్టేట్ మెంట్ సిట్ రికార్డ్ చెయ్యాలన్న రేవంత్ రెడ్డి
బీజేపీ నేతలు తనను పార్టీ మారాలని ఒత్తిడి చేశారని, తెలంగాణ రాష్ట్రంలో షిండే మోడల్ అమలు చేద్దామని వారు చెప్పారని పేర్కొన్న కవితను సిట్ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని సిట్ బృందం దర్యాప్తు చేయాలన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్టేట్మెంట్ ను సిట్ పోలీసులు రికార్డు చేయాలని ఆయన కోరారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేయాలన్నారు. కవిత ప్రకటన నేపథ్యంలో దీనిపై సిపి సివి ఆనంద్ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
కవితను రమ్మన్నది ఎవరు? ఎందుకు? తెలియాలి
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు ఎమ్మెల్యేలను చూడొద్దని, కవితను కూడా కలిపి కేసును విచారణ చేయాలన్నారు. ఇక బీజేపీలోకి కవితను ఎవరు రమ్మన్నారు? ఎందుకు రమ్మన్నారు? అనే విషయాలు ప్రజలకు తెలియాలని రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాదు కవితను రమ్మని ఆఫర్ ఇచ్చిన వారు ఎవరో వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో బీజేపీ టీఆర్ఎస్ లు కలిసి తెలంగాణ రాజకీయాలను కలుషితం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలను గతంలో ఎప్పుడూ చూడలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను నమ్ముకుని రాజకీయం చేస్తున్న కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను నమ్ముకొని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి. బందెలదొడ్డి లో బంధించినట్టు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను పంపించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంప్రదింపులు జరిపారు అన్న అంశం తనకు తెలియదని రేవంత్ రెడ్డి వెల్లడించారు. డీ. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశం గురించి తమకు తెలుసని , ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టిఆర్ఎస్, బిజెపి రెండు పార్టీలు రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయన్న రేవంత్ రెడ్డి ఈ రెండు పార్టీలకు వచ్చే ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలను దోచుకుంటున్న రాజకీయ పార్టీలను తరిమికొట్టాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.