అసమ్మతి నేతలకు రేవంత్ వార్నింగ్ - విమర్శలు చేస్తే పార్టీ బహిష్కరణ - హైకమాండ్ మద్దతు..!!
తెలంగాణ కాంగ్రెస్ లో తన పట్టు నిరూపించుకొనేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అసమ్మతి నేతల పైన ఉదాసీనంగా వ్యవహరించిన రేవంత్..ఇప్పుడు కఠిన నిర్ణయం ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో పార్టీ నేత రాహుల్ తో సమావేశం..ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో రేవంత్ ముందుగా పార్టీలో తనకు ఇబ్బందులు కలిస్తున్న వారి విషయంలో స్పష్టత కోరినట్లు తెలుస్తోంది. ఇక, తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో పీసీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది.
పార్టీ నాయకత్వం అనుమతితోనే
పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తో పాటుగా ఏఐసీసీ ముఖ్యులతోనూ తన పైన ధిక్కార స్వరం.. విమర్శలు చేస్తున్న అంశాల పైన చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలో అసమ్మతిని నియంత్రిస్తే.. టీఆర్ఎస్ -బీజేపీ పైన కలిసికట్టుగా పోరడటానికి పార్టీ మరింత బలంగా తయారవుతుందని వివరించినట్లుగా తెలుస్తోంది. దీంతో..తెలంగాణ పార్టీ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన అధినాయకత్వం సైతం రేవంత్ కు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. పార్టీ ముఖ్యమని తేల్చినట్లు సమాచారం. అందులో భాగంగానే..రేవంత్ కీలక ట్వీట్ చేసారు.

రేవంత్ మాటే ఇక ఫైనల్ అయ్యేనా
అందులో..కాంగ్రెస్ కు ఐకమత్యమే మహాబలం అని చెబుతూనే.. అందుకు భిన్నంగా ఎవరైనా పార్టీ ముఖ్యుల పైన...వివిధ హోదాలలో ఉన్న నాయకుల పైన, బహిరంగంగా లేదా సోషల్ మీడియా లో విమర్శలు చేస్తే పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ,క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు...అంటూ స్పష్టం చేసారు. ఇది పరోక్షంగా తన మీద వ్యాఖ్యలు..విమర్శలు చేస్తున్న వారికి వార్నింగ్ గా పార్టలో చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం వరకు జగ్గారెడ్డి..వీహెచ్..కోమటిరెడ్డి వంటి వారు ప్రత్యక్షంగా..పరోక్షంగా రేవంత్ పైన విమర్శలు చేసేవారు. ఢిల్లీ మీటింగ్ తరువాత వారంతా విమర్శలకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో వచ్చే నెలలో రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పర్యటన ఖరారైంది.

అసమ్మతికి చెక్.. అధినాయకత్వం సపోర్ట్
ఇక, పార్టీకి రాజకీయంగా వ్యూహాలు అందించేందుకు హైకమాండ్ నియమించిన సునీల్ టీం సభ్యులు సైతం..పార్టీలో ముందుగా అంతర్గతంగా ఐకమత్యంగా నడవాల్సిన అవసరం ఉందని సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో..హైకమాండ్ ఈ విషయంలో కఠినంగా ముందుకెళ్లాలని డిసైడ్ అయింది. తాజాగా జరిగిన పీసీసీ సమావేశానికి సైతం సునీల్ టీం సభ్యులు హాజరయ్యారు. ఆ తరువాతనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం.. పరోక్షంగా అసమ్మతి నేతలకు వార్నింగ్ గా కనిపిస్తోంది. ఇక ఎవరైనా విమర్శలు చేస్తే శాశ్వత బహిష్కరణ నిర్ణయం ఆషామాషీగా వెల్లడించన అంశ కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో..వీరిని అవసరమైతే పార్టీ వదులుకోవటానికి సైతం సిద్దంగా ఉందనే సంకేతాలు రేవంత్ ఈ ట్వీట్ ద్వారా స్పష్టం చేసినట్లు అంచనా వేస్తున్నారు. దీని పైన ఇప్పుడు పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతుంది..నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications