ఆ కేసుల సంగతేంటి..? పినరయి విజయన్ కు సీఎం రేవంత్ ఘాటు లేఖ
కేరళం రాష్ట్రం ఇప్పటివరకు సాధించిన విజయాలన్నీ గతంలోని యూడీఎఫ్ ప్రభుత్వాల పనితీరు ఫలితమేననే విషయాన్నిగుర్తించాలని కేరళం ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు రాసిన లేఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్డీఎఫ్ వరుసగా రెండు సార్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వాల హయాంలో ఏం జరిగిందో కేరళం ప్రజలకు తెలియజేయాలని సీఎం డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చకు దిగే ఉద్దేశం తనకు లేదని కేరళం ముఖ్యమంత్రి విజయన్ రాసిన లేఖకు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రత్యుత్తరం రాశారు. కేరళం ప్రభుత్వ పనితీరుపై తాను గౌరవంగా, హుందాగా స్పందించాలని అనుకున్నానని, కానీ, మీ ప్రతిస్పందనలో మాత్రం మీరు అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారని విజయన్ ను ఉద్దేశించి సీఎం పేర్కొన్నారు. ప్రత్యర్థుల తొందరపాటు వ్యాఖ్యలపై తానెప్పుడూ ఆవేశపూరితంగా స్పందించనని సీఎం తెలియజేశారు. మీరు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు, ఒక అతిథికి ఇవ్వాల్సిన గౌరవ, మర్యాదను ఇస్తానని విజయన్కు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలియజేశారు.
పదే పదే తప్పుడు ఉదాహారణ..
నీతి ఆయోగ్ ఎస్డీజీ సూచిక 2023-24ను పదే పదే తెలంగాణ రాష్ట్రానికి తప్పుడు విధంగా విజయన్ ఉదాహారిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్నది ప్రస్తుత ప్రజా ప్రభుత్వం కాదని, అది పదేళ్ల బీఆర్ఎస్-బీజేపీ పదేళ్ల దుష్పరిపాలన చివరి దశ అని విజయన్కు సీఎం తెలియజేశారు.

తెలంగాణలో తమ ప్రజా ప్రభుత్వం 28 నెలలు పూర్తి చేసుకున్నందున ఈ కాలంలో తమ పనితీరు ఆధారంగా తమని అంచనా వేయాలని కేరళం ముఖ్యమంత్రి విజయన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. 2024-25లో తెలంగాణ జీఎస్డీపీ రూ.16.12 లక్షల కోట్లుగా నమోదైందని, ఇది 10.7 శాతం వృద్ధి రేటుతో జాతీయ సగటు 9.9 శాతం కంటే ఎక్కువని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.87 లక్షలకు చేరుకుందని, ఈ గణాంకాల ఆధారంగా తెలంగాణ భారతదేశంలోనే ముందు స్థానంలో నిలిచిందని సీఎం స్పష్టం చేశారు. ఆర్బీఐ హ్యాండ్బుక్ 2024-25 గణాంకాల ప్రకారం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళం రాష్ట్రాలను తెలంగాణ అధిగమించిదన్నారు.












Click it and Unblock the Notifications