పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ క్లారిటీ..!
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. సమగ్ర కుల గణన కోసం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్.. ఫిబ్రవరి 2లోపు నివేదిక అందించనుంది. ఆ రిపోర్టు వచ్చాక పంచాయతీ ఎన్నికలపై రేవంత్ సర్కార్ ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ఇవాళ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
డెడికేటెడ్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళిక విభాగం చేపట్టిన సమగ్ర సర్వేను విజయవంతంగా నిర్వహించారని ఈ మేరకు సీఎం రేవంత్.. ఉన్నతాధికారులను అభినందించారు.

2024 ఫిబ్రవరి 1న పంచాయితీల్లో సర్పంచుల పదవీకాలం పూర్తయింది. ప్రస్తుతం ప్రత్యేక అధికార పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం రిజర్వేషన్లపై స్పష్టత ఇస్తే 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications