విచా"రణం": ఈటల ఇరుక్కుంటారా..భూముల వెనక అసలు కథ..!
మొన్న వాడీ వేడీగా జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించి ఆ గెలుపును ఆస్వాదిస్తున్న ఈటల రాజేందర్ను కేసీఆర్ సర్కార్ టార్గెట్ చేసిందా..? అసలు గెలుపు ఆస్వాదించేలోపే ఈటల మెడకు ఉచ్చు బిగించాలని ప్లాన్ చేస్తోందా అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి బీజేపీ వర్గాలు.

ఈటలకు ఇబ్బందులు తప్పవా..?
జమునా హేచరీస్.. ఈటల కుటుంబానికి చెందిన సంస్థ. అసలు ఈటల పొలిటికల్ కెరీర్లో ఒక్కింత మలుపు తిరిగేందుకు ఈ సంస్థే కారణం అని కూడా కొందరు చెబుతుంటారు. ఈ సంస్థ మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ఉంది. ఇక ఈటల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటి నుంచే ఈ సంస్థపై వివాదాలు అలుముకోవడం, కేసీఆర్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం జరిగింది. దీంతో ఈటల మనస్తాపానికి గురయ్యారు. తనకు పార్టీలో ప్రభుత్వంలో అవమానం జరిగిందని భావించి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, మంత్రి పదవికి ,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఆపై బీజేపీలో చేరారు. ఇక అప్పటి నుంచే ఈటల సంస్థపై మరింత వేగంగా విచారణ సాగింది.

అసలు ఏం జరిగింది
ఈటల రాజీనామా చేసి తిరిగి హూజూరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలవడంతో దేశం దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. ఇక ఈటల గెలిచి ఆ గెలుపును ఆస్వాదిస్తున్న సమయంలోనే మళ్లీ జమునా హేచరీస్కు సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. నాడు భూములు లాక్కున్నారని ఈటలపై రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం తనపై కక్షగట్టిందని అందుకే కొందరితో కావాలనే ఇలా చెప్పిస్తోందంటూ ఆరోపణలు చేశారు ఈటల. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ఇక కోర్టు భూములను సర్వే చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట్ గ్రామాల్లో ప్రభుత్వ పట్టాలు ఇచ్చిన అసైన్డ్ భూములను సర్వే చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మూడు రోజుల పాటు భూములను సర్వే చేయనున్నారు. 16వ తేదీ, 17వ తేదీ, 18వ తేదీల వరకు ఈ భూములను సర్వే చేయనున్నారు.

ఈటల తమ భూములను కబ్జా చేశారన్న రైతులు
ఇక ఈటల కుటుంబానికి చెందిన జమున హేచరీస్ సంస్థకు కూడా నోటీసులు జారీ చేశారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే. అచ్చంపేటలోని సర్వే నెంబర్ 130లో 18.20 ఎకరాల అసైన్డ్ భూమి,11 మంది రైతులకు నోటీసులు ఇచ్చినట్లు తూప్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ వెల్లడించారు. ఈ సర్వే నెంబర్లో జమునా పౌల్ట్రీ నిర్మాణం జరిగింది. ఈ క్రమంలోనే ఇక్కడ విచారణ చేయనున్నారు. అయితే భూములను ఈటల రాజేందర్ లాక్కున్నారని ఇప్పటి వరకు తమకెలాంటి న్యాయం చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈటల సిబ్బంది కనీసం లోపలికి కూడా రానివ్వడం లేదని రైతులు చెప్పారు. రైతులు ఎవరూ తమ భూములను అమ్ముకోలేదని ఈటల కబ్జాచేశారని చెప్పారు. తమకు న్యాయం జరగకుంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈటల సంస్థ ముందు ఎమ్మార్పీఎస్ ఆందోళన
భూముల ఆక్రమణకు సంబంధించి విచారణ చేస్తున్న సమయంలో ఈటల హైకోర్టును ఈ ఏడాది జూన్ నెలలో ఆశ్రయించారని దీంతో కోర్టు భూములను సర్వే చేయాలని సూచించినట్లు అధికారి ఒకరు తెలిపారు. జూన్ నెలలో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నందున సర్వే చేయలేకపోయామని, ముందస్తు నోటీసులు ఇచ్చి భూములను సర్వే చేసేందుకు వచ్చామని రెవిన్యూ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే ఎమ్మార్పీఎస్ జమున హేచరీస్ ముందు ధర్నాకు దిగారు. రైతులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. దళితుల భూములు ఈటల అక్రమంగా లాక్కున్నారని మండిపడ్డారు ఎమ్మార్పీఎస్ నాయకులు. ఈటలపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు తూతూ మంత్రంగా విచారణ చేయకుండా దళితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మొత్తానికి ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఈ భూముల వ్యవహారంతో ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచిచూడాలి.












Click it and Unblock the Notifications