న్యాయవాదిగా రోహిత్ వేముల సోదరుడు... ట్విట్టర్లో వెల్లడించిన తల్లి వేముల రాధిక...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. పేదరిక కుటంబ నేపథ్యం నుంచి సెంట్రల్ వర్సిటీలో స్కాలర్గా అడుగుపెట్టిన రోహిత్ ఆత్మహత్య చేసుకోవడంపై అప్పట్లో దేశవ్యాప్త ఉద్యమం జరిగింది. అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థుల్లో రోహిత్ వేములకు న్యాయం జరగాలంటూ నినదించారు. రోహిత్ది వ్యవస్థీకృత ప్రభుత్వ హత్యేనని అప్పట్లో చాలా ప్రజా సంఘాలు ఆరోపించాయి. రోహిత్ వేములకు న్యాయం జరగాలంటూ అతని తల్లి వేముల రాధిక జాతీయ స్థాయిలో పోరాడారు.
రోహిత్ చనిపోయిన సుమారు ఆరేళ్ల తర్వాత వేముల రాధిక తాజాగా ట్విట్టర్ ద్వారా ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేశారు. తన చిన్న కుమారుడు రాజా న్యాయశాస్త్రంలో పట్టా పొందినట్లు చెప్పారు. 'నా చిన్న కుమారుడు రాజా వేముల ఇప్పుడు న్యాయవాది అయ్యాడు. రోహిత్ చనిపోయిన ఐదేళ్ల తర్వాత మా జీవితాల్లో వచ్చిన పెద్ద మార్పుల్లో ఇదొకటి.రాజా ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తాడు. వారి హక్కుల కోసం పోరాడుతాడు. ఇది నా పే బ్యాక్ టు సొసైటీ.' అని వేముల రాధిక తన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. 'పే బ్యాక్ టు సొసైటీ' అన్నది డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ నినాదం. ఎవరైనా వ్యక్తి తాను ఏ సమాజం నుంచి ఎదిగొస్తాడో ఆ సమాజం కోసం తనవంతుగా ఏదైనా చేయాలన్నదే ఈ నినాదం ప్రధాన ఉద్దేశం.
Raja Vemula, my younger son, is now an Advocate. After 5 yrs, It's one of the major changes happened in our lives since Rohith Vemula. Adv. Raja Vemula will now work/fight for the people & their Rights in the Court of Law and it's my "Pay Back to Society". Bless him.
— Radhika Vemula (@vemula_radhika) December 18, 2020
Jai Bhim 🙏
కాగా,2015లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో రోహిత్ వేముల సహా ఐదుగురు దళిత స్కాలర్స్పై యూనివర్సిటీ వీసీ వేటు వేశారు. వారిని క్యాంపస్ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత యూనివర్సిటీ ప్రాంగణంలోనే వెలివాడ పేరుతో ఆ ఐదుగురు విద్యార్థులు కొద్దిరోజుల పాటు నిరసన వ్యక్తం చేశారు.ఇదే క్రమంలో రోహిత్ వేముల జనవరి 17,2016న హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్పటికి రోహిత్ వయసు 26 ఏళ్లు. రోహిత్ ఆత్మహత్య విషయంలో అప్పటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. రోహిత్పై చర్యలకు ఆయన అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికి లేఖ రాశారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. అయితే దత్తాత్రేయ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. యూనివర్సిటీలో పరిస్థితులను చక్కదిద్దాలని లేఖ ద్వారా కోరానే తప్ప... ఎవరి మీద బహిష్కరణ వేటు వేయాలని కోరలేదన్నారు.