రోహిత్ ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్: 'నేను వెళ్లేసరికే మరణించాడు'
న్యూఢిల్లీ: హెచ్సీయూ పీహెచ్డీ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న కొద్ది సేపటికే తాను ఘటనాస్థలానికి వెళ్లానని వర్సిటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. రాజ్శ్రీ గురువారం మీడియాకు వెల్లడించారు. జనవరి 17న రాత్రి తాను వెళ్లేసరికే రోహిత్ మంచంపై పడి ఉన్నాడని ఆమె తెలిపారు.
రోహిత్ వేముల మృతదేహాన్ని పరీక్షించేందుకు, ఆసుపత్రికి తరలించేందుకు వైద్యుల్ని, పోలీసుల్ని లోపలికి అనుమతించలేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ బుధవారం పార్లమెంట్లో అన్న సంగతి తెలిసిందే.
రోహిత్ మృతిని రాజకీయం చేసేందుకు మృతదేహాన్ని దాచిపెట్టారని, మరుసటిరోజు ఉదయం 6.30గంటల వరకు పోలీసుల్ని లోపలికి అనుమతించలేదని తెలంగాణ పోలీసుల నివేదికను వూటంకిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ సమాధానికి ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకొంది.
అయితే ఆరోజు ఈ ఘటనపై మీడియా గురువారం చీఫ్ మెడికల్ ఆఫీసర్ను ప్రశ్నించగా.... ‘ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడని జనవరి 17న రాత్రి 7.20 గంటల సమయంలో నాకు సమాచారం అందింది. వెంటనే నేను వసతి గృహానికి వెళ్లేసరికి రోహిత్ మంచంపై అచేతనంగా పడి ఉన్నాడు. తర్వాత 15 నిమిషాలకే పోలీసులు అక్కడికి వచ్చారు' అని అన్నారు.
మరోవైపు రోహిత్ వేముల ఆత్మహత్యపై రూపన్వాల్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ మూడు రోజుల విచారణ అబిడ్స్ గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో గురువారం ముగిసింది. చివరిరోజు విచారణకు వర్సిటీ వైస్ ఛాన్సలర్ పి.అప్పారావు, ఇంఛార్జి వీసి ఎం.పెరియస్వామి, ఇంఛార్జి రిజిస్ట్రార్ సుధాకర్తోపాటు పలువురు బోధనా సిబ్బంది, విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
వర్సిటీలోని ఏబీవీపీ నేత సుశీల్కుమార్పై దాడి నుంచి రోహిత్ ఆత్మహత్య వరకు జరిగిన పరిణామాలపై వివరాలు సేకరించారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు తాము కమిషన్ను కలిసి వివరణ ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించినా పోలీసులు లోపలికి అనుమతించలేదని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.