మద్యం తాగి, మహిళలను గదికి తెచ్చేవాడు: అందుకే చంపేశాడు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీలోని హాస్టల్లో సంచలనం సృష్టించిన యువకుడి దారుణ హత్య కేసును కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు కేసు సంబంధిత వివరాలను వెల్లడించారు.
గత నెల 17న వివేకానందనగర్ కాలనీలోని అనిల్స్ హాస్టల్లోని ఏ బ్లాక్ రూం నంబర్ 108లో ఉంటున్న వికారాబాద్ గిరిగేట్పల్లికి చెందిన గోపి అలియాస్ గోపాల్ (25) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తలపై సుత్తితో మోదడంతోపాటు వాటర్ హీటర్తో శరీరంపై కాల్చి చంపారు. గోపాల్తో అదే గదిలో ఉంటున్న ఆదిలాబాద్ జిల్లా కౌతాల, విజయనగరంపల్లికి చెందిన శౌర్యకు హత్యతో సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానించారు.

దాంతో పోలీసులు శౌర్య కోసం గాలింపు ప్రారంభించారు. శౌర్యను అదుపులో తీసుకొని విచారించారు. తానే హత్య చేసినట్టు శౌర్య అంగీకరించాదడు. శౌర్య అలియాస్ మరియ శౌర్య(37), గోపాల్తో పాటు అనిల్స్ హాస్టల్లో ఉండేవాడు. సౌత్ఇండియా షాపింగ్ మాల్లో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో గోపాల్ శౌర్యను ఇబ్బందులకు గురి చేసేవాడు.

గదిలో మద్యం తాగడం, మహిళలను గదికి తీసుకు వచ్చి శౌర్యను గది నుంచి బయటికి వెళ్లమనడం, ప్రశ్నిస్తే కొట్టడం చేసేవాడని చెబుతున్నారు దీంతో పగ పెంచుకున్న శౌర్య గోపాల్ అడ్డు తొలగించుకోవాలని ఆగస్టు 17న భాగ్యనగర్ కాలనీలోని హాట్ అండ్ చిల్ బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం తాగి అర్ధ రాత్రి హాస్టల్ గదికి వచ్చాడు. ఆ సమయంలో గోపాల్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఇదే అదునుగా భావించిన శౌర్య టూల్కిట్లో ఉన్న సుత్తితో గోపాల్ తలపై బాదాడు.

దీంతో గోపాల్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అంతటితో ఆగకుండా వాటర్ హీటర్తో శరీరంపై కాల్చాడు, గోపాల్ ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి, గోపాల్ వద్ద ఉన్న పర్సు, మొబైల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. శౌర్యను అదుపులోకి తీసుకొని గోపాల్కు చెందిన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications