హుజూరాబాద్ నియోజకవర్గంలోని 14,400 కుటుంబాల ఖాతాల్లోకి దళితబంధు డబ్బులు 10లక్షలు
హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బందు లబ్ధిదారులకు తీపి కబురు అందించింది. 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం మంగళవారం నిధులు జమ చేసింది. ఈ మేరకు కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. బుధవారం నుంచి అధికారులు రీ సర్వే చేస్తారని, దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం అమలవుతుందని చెప్పారు.
మంగళవారం కలెక్టరేట్లో క్లస్టర్ అధికారులు, ప్రత్యేక అధికారులతో దళిత బంధుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రీ సర్వేలో రేషన్కార్డులు లేని వారి వివరాలు, వలస వెళ్లిన వారి వివరాలను కూడా నమోదు చేసుకొని యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. రీసర్వేలో భాగంగా బ్యాంకర్లను కూడా వెంట తీసుకెళ్లి కొత్తగా గుర్తించిన వారికి కూడా ఖాతాలు తెరిపించాలని సూచించారు.
మొదటిసారి సర్వే చేసినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే రీ సర్వేలో వారిని గుర్తించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఖాతాలో డబ్బులు జమ కాగానే సెల్ఫోన్లకు సంక్షిప్త సమాచారం వస్తుందని, దీన్ని అధికారులు ధ్రువీకరించుకోవాలని సూచించారు. దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం అమలు చేయడంతోపాటు ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

గురువారం సీఎం నేతృత్వంలో కీలక సమావేశం
దళిత బంధు పథ కం అమలు, శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణ, వినాయక నిమజ్జనం తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్రమంత్రి మండలి గు రువారం సమావేశం కానుంది. మ ధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమం త్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన సమావేశం జరుగనున్నది. ఇప్పటికే పైలట్ నియోజకవర్గంగా ఎంపిక చేసి న హుజూరాబాద్తోపాటు, యా దాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలోని దళితుల ఖాతాల్లో దళితబంధు నిధులు జమయ్యాయి. ఈ నిధులతో దళితుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై క్యాబినెట్ సమగ్రంగా చర్చించనున్నట్టు తెలిసింది. సెప్టెంబర్ 25వ తేదీలోపు శాసనసభ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే యో చనలో ప్రభుత్వం ఉంది. ఈ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలను చర్చకు పెట్టాలి? అనే అంశాలపై క్యాబినెట్ లో చర్చించనున్నారు.
ఇక, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను హుస్సేన్సాగర్ జలాల్లో నిమజ్జనం చేయకూడదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తే ఏమి చేయాలన్న దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. కోర్టు ఏ తీర్పు ఇచ్చినా విగ్రహాలను హుస్సేన్సాగర్లోనే నిమజ్జనం చేస్తామంటూ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమం సాఫీ గా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై క్యాబినెట్లో చర్చించనుంది. వీటితోపాటు, సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన వినతులు, కృష్ణా, గోదావరి నీటి కేటాయింపుల్లో కేంద్రం వైఖరి.. రాష్ట్రం అనుసరించాల్సిన వ్యూహం, ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్తు బకాయిల సమస్య, ధరణిలో అమలులో వస్తున్న ఫీడ్బ్యాక్, 111 జీవోపై హైకోర్టులో వాజ్యం తదితర అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
మెట్రోను ఆదుకుంటాం: కేసీఆర్
కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడంతో హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో.. ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్అండ్టీ కంపెనీ ఉన్నతాధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో.. కరోనా కష్టాలను అధిగమించి మెట్రో తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వం సహకారం అందిస్తామని కంపెనీ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. మంగళవారం ప్రగతి భవన్లో ఎల్అండ్టీ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెట్రో ఉన్నతాధికారులు ఆర్థిక నష్టాలు, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీల వివరాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నగరానికి మెట్రోసేవలు ఎంతో అవసరం
భేటీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అనతి కాలంలోనే సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తూ ప్రజాధరణ పొందిందన్నారు. కరోనా అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లే మెట్రోనూ ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, భవిష్యత్లో మెట్రో మరింత విస్తరించాల్సి ఉందన్నారు. కరోనా దెబ్బతో మెట్రో అప్పుల్లో కూరుకుపోవడం, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి రావడం శోచనీయమన్నారు. అన్ని రంగాలను ఆదుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రోను గాడిలో పెట్టేందుకు తమ వంతు కృషి చేస్తుందన్నారు. ఎలాంటి విధానాలు అవలంభించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలుగుతామో విశ్లేషించనున్నట్లు పేర్కొన్నారు. సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని, ప్రజావసరాల దృష్ట్యా కరోనా వంటి క్లిష్ట సందర్భాల్లో వినూత్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.
మెట్రో తిరిగి పుంజుకునేలా చర్యలు
హైదరాబాద్ మెట్రోను ఆదుకోవడంతో పాటు తిరిగి పుంజుకుని ప్రజావసరాల దృష్ట్యా మరింతగా విస్తరించే దిశగా చర్యలు సీఎం కేసీఆర్ కంపెనీ అధికారులకు భరోసా ఇచ్చారు. ఇందుకు విస్తృతంగా చర్చించి పూర్వాపరాలను పరిశీలించి ఏ విధానం అవలంభించడం ద్వారా మెట్రోకు పూర్వవైభవం తీసుకురాగలమో అవగాహన కోసం ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కమిటీలో మున్సిపల్ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగరావు, ఫైనాన్స్ స్పెషల్ సెక్యూటరీ రామకృష్ణారావు, ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఉంటారని సీఎం పేర్కొన్నారు. నష్టాల బారి నుంచి మెట్రోను ఆదుకునేందుకు తన వంతు బాధ్యతగా ఆదుకునే అంశంపై అన్ని రకాలుగా పరిశీలించి, అధ్యయనం చేసి త్వరలో నివేదిక అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Recommended Video
సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ రావు, ఎంఏఅండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, మెట్రో అధికారులు, ఎల్అండ్టీ సీఈఓ అండ్ ఎండీ సుబ్రహ్మణ్యం, ఎన్వీఎస్ రెడ్డి, సంస్థ డైరెక్టర్ డీకే సేన్, ప్రాజెక్టుల సీఈఓ అజిత్, హైదరాబాద్ మెట్రో సీఈఓ కేవీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications