తెలంగాణా ప్రభుత్వానికి రూ.5 కోట్ల విరాళం.. సేవలందిస్తున్న వారికి భోజనం : 'మేఘా' ఔదార్యం
కరోనా వైరస్ పై భారత్ యుద్ధం చేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో లాక్ డౌన్ ప్రకటించి అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయని చెప్పాయి . ఇక ఈ నేపధ్యంలో రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలకు , అలాగే కరోనాపై యుద్ధం చేస్తున్న సైన్యం అయిన వైద్యులు, పోలీసులు, మీడియా, సానిటేషన్ సిబ్బందికి తమ వంతు సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది ప్రముఖ నిర్మాణ సంస్థ.

కరోనా రిలీఫ్ కోసం సేవలు చేస్తున్న సిబ్బందికి భోజనం ...
ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్' లాక్ డౌన్ తో ఇబ్బందిపడుతున్న దినసరికూలీలు, నిరు పేదలతోపాటు కరోనా మహమ్మారిని తరిమివేయడానికి 24 గంటలు పనిచేస్తున్న పోలీసులకు, ఆరోగ్య సిబ్బందికి, మీడియా వాళ్లకు హైదరాబాద్ లో భోజన వసతి కల్పించడానికి సిద్ధమైంది. అంతేకాకుండా కరోనా వైరస్ బారినపడిన వారికి చేయూతగా మెడిసన్స్ తో పాటు మెడికల్ ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కూడా కల్పిస్తుంది .

పోలీసులకు ఫుడ్ అందించనున్న మేఘా సంస్థ
తాజాగా మేఘా సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ను కలిసి ఈ మేరకు తమ నిర్ణయాన్ని తెలియజేశారు . పౌష్టికరమైన 4వేలకు పైగా ఫుడ్ ప్యాకేట్లను అందజేస్తామని చెప్పారు.ఇక రేపటి నుంచి మూడు పూటలా సేవలందిస్తున్న వారికి భోజనం అందిస్తామని ప్రకటించారు .ఇక తాము అందించే భోజనాన్ని పోలీసులకు అందిస్తామని వారే క్షేత్ర స్థాయిలో అసహాయులకు, వైద్య సిబ్బందికి, అవసరం అయిన వారందరకీ పంపిణి చేయాలని కోరింది.

తెలంగాణా, ఏపీలలో సాయానికి రెడీ
ఇక తెలంగాణతోపాటు, ఏపీలోనూ ఇలా తమ సేవలు అందించటానికి ‘మేఘా' సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తోపాటు ఏపీ పోలీసులకు వీటిని అందజేయాలని భావిస్తున్నారు.. పోలీసులు ఆహార కొరతతో బాధపడుతున్న వారికి వీటిని అందజేస్తారు. ఇలా అసహాయులకు, కరోనాపై పోరాడుతున్న వారిని ఆదుకునేందుకు మేఘా ముందుకు వచ్చింది . ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలు తమ వంతు సాయం అందిస్తున్న సమయంలో మేఘా సంస్థ కూడా ముందుకు రావటం పై హర్షం వ్యక్తం అవుతుంది.

తెలంగాణా సీఎం కు రూ. 5 కోట్ల విరాళం అందించిన మేఘా సంస్థ
ఇక అంతే కాకుండా ‘మేఘా' సంస్థ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తనవంతు బాధ్యతగా రూ. 5 కోట్లను విరాళంగా ఇచ్చింది. కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా ఈ విరాళం ఇస్తున్నట్టు ప్రకటించింది 5 కోట్ల రూపాయలకు చెక్కును ముఖ్యమంత్రి కి అందచేసిన మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి కేసీఆర్ సర్కార్ కు అండగా ఉంటామని లేఖ రాశారు.












Click it and Unblock the Notifications