తెలంగాణలో రూ. 500 కోట్ల పెట్టుబడితో అమూల్ పరిశ్రమ: గర్వకారణమంటూ కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రానికి అమూల్ సంస్థ రావడం గర్వకారణమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, పాలు, పాల ఉత్పత్తుల రంగంలో ప్రఖ్యాతిగాంచిన అమూల్ సంస్త తెలంగాణలో రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఒప్పందం చేసుకుంది.
రాష్ట్రంలోని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో మొదటి దశలో రూ. 300 కోట్లు, రెండో దశలో రూ. 200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దక్షిణ భారతదేశంలోనే అమూల్ తన తొలిప్లాంట్ ను రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నట్లు, భవిష్యత్తులో దీన్ని 10 లక్షల లీటర్లకు పెంచుకునే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.
ప్లాంట్ నిర్మాణంతో పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్, స్వీట్స్ వంటి వాటిని ఇక్కడి ఉత్పత్తి చేయనున్నట్లు అమూల్ ప్రతినిధులు తెలిపారు. దీంతోపాటు బ్రెడ్, బిస్కెట్, బేకరీ పదార్థాలు కూడా ఉత్పత్తి చేయనుంది. ప్లాంట్ ఏర్పాటుతో 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. తమ ఉత్పత్తులకు అవసరమైన పాలను తెలంగాణ నుంచే సేకరిస్తామని అమూల్ కంపెనీ హామి ఇచ్చింది.
ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అమూల్ కంపెనీని మంత్రి కేటీఆర్ అభినందించారు. తెలంగాణలో మరో శ్వేత విప్లవం ప్రారంభమైందన్నారు. పెట్టుబడి పెట్టేందుకు అమూల్ తెలంగాణను ఎంచుకోవడం ద్వారా ఇక్కడి పాడి పరిశ్రమకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
For all us who have grown up seeing the brilliant Ads with the witty puns, to the outstanding movie in Manthan depicting the incredible society and brand Amul is - proud to announce 500 Cr investment in our state of telangana 😊
— KTR (@KTRTRS) December 29, 2021
Welcome Amul to Telangana https://t.co/GRf0xFmboB
దక్షిణ భారతదేశంలోనే తన తొలి ప్లాంటును తెలంగాణలో ఏర్పాటు చేస్తుండటంపై కంపెనీకి ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు మంత్రి కేటీఆర్. త్వరలోనే పనులను ప్రారంభిస్తుందని మంత్రి వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఏపీలో అమూల్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.