మునుగోడు ఉపఎన్నిక వేళ జూబ్లీహిల్స్లో పట్టుబడ్డ రూ.89.92 లక్షలు.. భారీగా బయటపడుతున్న నోట్లకట్టలు!!
మునుగోడు ఉప ఎన్నికల వేళ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఎక్కడ చూసినా సరైన పత్రాలు లేని కోట్ల నగదు పట్టుబడటం ఆందోళన కలిగిస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా డబ్బులు పట్టుబడడం రాజకీయ వర్గాల్లోనూ, ప్రజలను షాక్ కు గురి చేస్తుంది. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న వేళ ఎక్కడికక్కడ పెద్దమొత్తంలో నగదు పట్టుబడుతుంది.

కారులో తరలిస్తున్న 89.92 లక్షల నగదు పట్టివేత
గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లా తో పాటుగా, హైదరాబాద్లోనూ హవాలా డబ్బు పట్టుబడుతుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరోమారు హైదరాబాద్లో భారీగా డబ్బులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు జరిపిన పోలీసులు ఓ కారులో తరలిస్తున్న 89.92 లక్షల నగదును గుర్తించారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారన్న సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 71 వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో టీఎస్ 27డీ 7777 నంబర్ ప్లేట్ ఉన్న మహీంద్రా థార్ వాహనంలో తరలిస్తున్న క్రమంలో నగదును పట్టుకున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు
అయితే ఆ మొత్తానికి సంబంధించిన సరైన పత్రాలు చూపించక పోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులకు విచారణ నిమిత్తం అప్పగించారు. ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం పంజాగుట్టలో 70 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. ఇక బేగం బజార్ లో 48.6 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. నగర శివార్లలో మరో 45 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. ఇక గత 18 రోజుల్లో హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ పరిధిలో మొత్తం 20 నుంచి 26 కోట్ల మేర అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టుబడడం గమనార్హం.

నగదు పట్టుబడుతున్న ఘటనలపై ఆసక్తి
అయితే ఈ నగదు అంతా మునుగోడులో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తరలిస్తున్నారు అన్న అనుమానం అందరిలోనూ ఉంది. ఇంతకీ పట్టుబడుతున్న నగదు ఎవరిది? ఏ పార్టీ ఇంతగా డబ్బులను తరలిస్తూ పట్టుబడుతుంది అన్నది మాత్రం బయటకు రావడం లేదు. ఇంత పెద్ద మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడుతున్న తీరు తెలంగాణాలో చర్చనీయాంశంగా మారుతుంది.












Click it and Unblock the Notifications