హైదరాబాద్లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.. రేపటి నుంచి పునరుద్దరణ..?
హైదరాబాద్లో రేపటి నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కే అవకాశం కనిపిస్తోంది. బుధవారం(జూన్ 10) ఉదయం 5గం. నుంచి డ్యూటీలో చేరాలని నగరంలోని 29 డిపోల మేనేజర్లకు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. దీంతో సిటీ బస్సులు పునరుద్దరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లాక్ డౌన్ కారణంగా గత 80 రోజులుగా సిటీ బస్సులు నిలిచిపోయాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఆర్టీసీపై సమీక్షా సమావేశం నిర్వహించారు.అంతరాష్ట్ర బస్ సర్వీసులు,సిటీ బస్సుల నిర్వహణపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు.
నిజానికి ఈ నెల 8 నుంచే సిటీ బస్పులు నడపాలని ప్రభుత్వం భావించింది. కానీ గత కొద్దిరోజులుగా నగరంలో కేసుల సంఖ్య తీవ్రమవడంతో ఆ ఆలోచన విరమించుకుంది. అయితే తాజా సమీక్షా సమావేశంలో బస్సులు నడిపేందుకే ప్రభుత్వం మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగతా ప్రాంతాల్లో బస్సులు నడిపితే ఎలా ఉంటుందని ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నగరంలో చాలామంది పనులకు వెళ్లి వచ్చేవారు.. బస్సులు లేని కారణంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక తెలంగాణలోకి తమ బస్సులను అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ సీఎస్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర సర్వీసులపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.