హైదరాబాద్ వాసులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇకపై రాత్రి 10:30 నుంచి ఉదయం 5 గంటల వరకు బస్సు సేవలు..
హైదరాబాద్ నగరవాసులకు నిత్యం ఉపాధి, ఉద్యోగాలు అంటూ ఉరుకుల పరుగుల జీవితం ఉంటుంది. నగరంలోని చాలామంది ఉపాధి, ఉద్యోగం నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే రాత్రి 10 గంటల తర్వాత బస్సులు, 11 గంటల తర్వాత మెట్రో సేవలు నిలిచిపోతున్నాయి. దాంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలో వెళ్లాలంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఇక సొంత వాహనాల్లో అంత దూరం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లో సుదూర ప్రాంతాలకు వెళ్లి పని చేసి ఇంటికి వచ్చే వారిలో పురుషులతోపాటు మహిళలూ అధిక సంఖ్యలోనే ఉన్నారు. అయితే వారి ఇబ్బందుల్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఇకపై హైదరాబాద్ లో రాత్రి సమయాల్లోనూ బస్సులు నడపాలని నిర్ణయించింది.
హైదరాబాద్ లో రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు స్పెషల్ బస్సులను నడపాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై ప్రతిరోజూ రాత్రి 10:30 నుంచి ఉదయం 5:00 గంటల వరకూ నిరంతరాయంగా ఈ బస్సులు నడుస్తాయి. నైట్ షిఫ్ట్ ఉద్యోగులు, ఐటీ- బీపీఓ సిబ్బంది, రాత్రి ప్రయాణించే వారికి ఈ సేవలు ఎంతో ఉపయోగకరం కానున్నాయి. ఇక తొలి దశలో 30 బస్సులను ఏర్పాటు చేయనున్నారు. 6 ప్రధాన మార్గాల్లో ఈ సేవలు ప్రారంభించారు. ప్రయాణికుల స్పందన, ఆక్యూపెన్సీ ఆధారంగా రానున్న రోజుల్లో మరిన్ని మార్గాలకు బస్సు సేవలను విస్తరించనున్నారు.

బస్సుల వివరాలు చూస్తే మేడ్చల్ నుంచి గచ్చిబౌలి వరకు 195 బస్సు నెంబర్, కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు 10హెచ్, కోఠి నుంచి పటాన్ చెరు వరకు 218 బస్సు, అలాగే కోఠి నుంచి పటాన్ చెరు వరకు 222ఏ, ఇక హయత్ నగర్ నుంచి జేబీఎస్ వరకు 290యూ, సికింద్రాబాద్ నుంచి పటాన్ చెరు వరకు 219 బస్సులను నడపనున్నారు. ఈ సేవల ద్వారా హైదరాబాద్ వాసులకు క్యాబ్ లు, ఆటోలపై ఆధారపడే అవకాశం తగ్గనుంది. ఈ మేరకు రాత్రి ప్రయాణించేవారికి ప్రజా రవాణా మరింత అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications