దసరా పండుగ వేళ ప్రయాణికులకు ఆర్టీసీ షాక్!
దసరా పండుగ వేళ తమ తమ సొంత ఊర్లకు వెళ్లడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో దసరాకు, సద్దుల బతుకమ్మకు ఊర్లకు వెళ్లేవారికి తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని శుభవార్త చెబుతూనే, ఇదే సమయంలో ఊహించని షాక్ ఇచ్చింది.
ప్రయాణికులకు ఆర్టీసీ షాక్
సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు తమ సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా, పక్క రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ప్రత్యేక బస్సులలో సాధారణ బస్సులలో ఉండే ఛార్జీల కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.

చార్జీల మోత మోగిస్తున్న ఆర్టీసీ
సాధారణ బస్సులలో చార్జీల కంటే ప్రత్యేక వస్తువులలో 25% అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు పండుగ వేళ టిఎస్ఆర్టిసి అదనపు చార్జీలతో మోత మోగిస్తుందని తమ జేబులకు చిల్లు పెడుతోందని వాపోతున్నారు. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకగా ఇక బస్సు చార్జీ లు కూడా విపరీతంగా పెంచడంతో ప్రయాణికులలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు
రాష్ట్రవ్యాప్తంగా 6, 304 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి సొంత ఊళ్ళకి వెళ్లే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచుతున్నట్టు టీజీ ఆర్టీసీ పేర్కొంది. ఈసారి మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రద్దీ కారణంగా గత ఏడాదితో పోలిస్తే అదనంగా 600 స్పెషల్ సర్వీస్ లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.
బస్సు చార్జీలపై ఆర్టీసీ అధికారులు చెప్తుందిదే
ఇప్పటికే దసరా పండుగకు సొంత ఊర్లకు వెళ్లే వాళ్ళు ప్రయాణాలు ప్రారంభించగా బస్సులలో టికెట్ ధరల పైన వారిలో అసహనం వ్యక్తం అవుతుంది. అయితే అన్ని బస్సులలోనూ టికెట్ చార్జీలు పెంచలేదని ప్రత్యేక బస్సులలో మాత్రమే టికెట్ చార్జీలను పెంచినట్టుగా అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ లో ఈ ప్రాంతాలలో ప్రత్యేక ఏర్పాట్లు
ఇదిలా ఉంటే హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, కూకట్పల్లి, గచ్చిబౌలి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, బోయిన్పల్లి, ఐఎస్ సదన్, శంషాబాద్ ప్రాంతాలలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ప్రయాణికులకు అక్కడ అన్ని రకాల సౌకర్యాలను కల్పించి ప్రత్యేక బస్సు సర్వీస్ లను ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ చెబుతుంది. ఏది ఏమైనా ధరల బాదుడుతో ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు ఊహించని షాక్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications