సైదాబాద్ హత్యాచార ఘటన : చిన్నారి అస్థికలను కృష్ణా నదిలో కలిపిన తల్లిదండ్రులు
హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఇటీవల హత్యాచారానికి గురైన చిన్నారి అస్థికలను తల్లిదండ్రులు కృష్ణా నదిలో కలిపారు.నాగార్జునసాగర్లోని శివాలయం పుష్కర్ఘాట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నదిలో అస్థికలు కలిపారు.ఈ సందర్భంగా చిన్నారి బంధువులు మాట్లాడుతూ... నిందితుడు రాజు మరణంపై తమకు సంతృప్తి లేదన్నారు.నిందితుడిని తమకు అప్పగించి ఉంటే బాగుండేదన్నారు.భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
మూడు రోజుల క్రితం స్టేషన్ ఘన్పూర్-వరంగల్ మధ్య నష్కల్ సమీపంలో రైల్వే ట్రాక్పై రాజు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రైల్వేట్రాక్పై రాజు శవాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. చేతిపై మౌనిక అనే పేరుతో టాటూ గుర్తించిన పోలీసులు ఆ మృతదేహం రాజుదేనని నిర్ధారించారు. రాష్ట్రవ్యాప్తంగా అతని కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుండటంతో... ఇక తప్పించుకోలేని పరిస్థతుల్లో అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
సంచలనం రేపిన హత్యాచార ఘటన :
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి సెప్టెంబర్ 9న హత్యాచారానికి గురైంది.స్థానికంగా ఉండే రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయినా ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రాంతంలో జులాయిగా తిరిగే రాజుపై అనుమానం వచ్చింది. నల్గొండ జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ చిరు నవ్వులతో ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ ఓ దుర్మార్గుడి దాష్టికానికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు.
ఘటన జరిగిన దాదాపు వారం రోజులకు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దాదాపు 1000 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి రాజు కోసం గాలించారు.దీంతో ఇక తప్పించుకోవడం అసాధ్యమని భావించిన రాజు కోణార్క్ ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడికి భార్య,కుమార్తె ఉన్నారు.