కూల్చివేతకు ముస్తాబవుతున్న సమతా బ్లాక్..!? మొట్టమొదటి శంఖుస్థాపన అక్కడే..!!
Recommended Video
హైదరాబాద్: సచివాలయ సముదాయాల కూల్చి వేతలకు ముహూర్తం ఖరారయ్యింది. ప్రస్తుత సచివాలయంలోని సమతా బ్లాక్ ముందు నూతన సచివాలయానికి శంకుస్థాపన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పునర్నిర్మాణంలో సచివాలయాన్ని మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న స్థలాలతోపాటు సచివాలయం పక్కన, వెనుక మింట్కంపౌడ్లోని పలు స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ప్రస్తుతం సచివాలయానికి 4.7 ఎకరాల స్థలం ఉండగా, మరో 3ఎకరాలు దీనికి జతకానుంది. భూసేకరణ ప్రక్రియను వెంటనే చేపట్టనున్నారు. సచివాలయం, శాసనసభ నూతన భవనాల నిర్మాణ టెండర్లను వచ్చే నెలాఖరులో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటి నమూనాలపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సమీక్షించి తుదిరూపు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ రెండు భవన సముదాయాలకు సంబంధించి ముంబయికి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ నమూనాలను రూపొందించారు. నమూనాలపై సమీక్షించేందుకు ఆర్కిటెక్ట్ను హైదరాబాద్ పిలిపించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
ఈ నెల 27వ తేదీన సచివాలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చంద్రశేఖర్ రావు ఇప్పటికే ప్రకటించారు. శాసనసభ నిర్మాణానికి కూడా సచివాలయంలోనే శంకుస్థాపన చేస్తారా? లేక ఎర్రమంజిల్ ప్రాంగణంలో చేస్తారా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాల అప్పగింత గురువారం పూర్తయింది. ఇరు రాష్ట్రాల అధికారులు దీనికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. తెలంగాణ జీఏడీ అధికారిణి చిట్టిరాణి మాట్లాడుతూ.. 'సచివాలయం మొత్తం తెలంగాణ పరిధిలోకి వచ్చింది. బ్యాంక్లు, తపాలా కార్యాలయం స్వాధీనం చేసుకున్నాం. స్నేహపూర్వక వాతావరణంలో భవనాల అప్పగింత జరిగింద'ని చెప్పారు. శాసనసభ భవనాల అప్పగింత ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇన్ఛార్జి కార్యదర్శి విజయరాజ్ ఆధ్వర్యంలోని బృందం గురువారం హైదరాబాద్లోని తెలంగాణ శాసనసభకు వచ్చారు. తెలంగాణ శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులతో భేటీ అయ్యారు. భవనాల అప్పగింత ప్రక్రియ మొదలుపెట్టారు. శాసనసభలోని మంత్రుల ఛాంబర్లు, లాబీల అప్పగింత ప్రక్రియ గురువారం పూర్తయింది. మిగిలిన ప్రధాన భవనాల అప్పగింత ప్రక్రియ శుక్రవారం పూర్తిచేయనున్నారు.