సమ్మక్క ఆగమనం నేడే ..పున్నమి వేళ... మేడారంలో మహాద్భుతం
అడవి బిడ్డల అపురూపమైన జాతర .. కొండా కోనా పరవశించే జాతర ... మేడారం మహా జాతర. సారలమ్మ గద్దెలపై కొలువుతీరటంతో ఊపందుకున్న జాతరలో నేడు అందరూ ఎదురు చూసే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చిలకలగుట్ట నుండి డోలు, కొమ్ము వాయిద్యాల చప్పుళ్ళతో , అధికార యంత్రాంగ హడావిడితో , గాలిలోకి కాల్పులు జరిపి ఆ తల్లికి స్వాగతం పలుకగా సమ్మక్క కుంకుమ భరిణె రూపంలో గద్దెలపై కొలువు తీరనుంది. పున్నమి నాడు నిండు జాబిలిగా ఆ తల్లి దర్శనం ఇవ్వనుంది.
Recommended Video
నేటి నుండే మేడారం మహా జాతర సంరంభం .. సారలమ్మ ఆగమనంతో తొలి ఘట్టం
కొలువుతీరిన సారలమ్మ .. నేడు గద్దెపైకి సమ్మక్క
మేడారం జాతరలో భాగంగా బుధవారం సాయంత్రం సారలమ్మను గద్దె వద్దకు తీసుకొచ్చారు. కోయ పూజారులు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో సాయంత్రం గం.5.10ని.లకు గద్దెపై కొలువుదీరింది సారలమ్మ. ఈ సందర్భంగా భక్తులు ఆ తల్లికి జయజయధ్వానాలు పలికి ఘనస్వాగతం చెప్పారు. గద్దెపై కొలువుతీరిన అమ్మవారిని తనివితీరా చూసి తరించారు . ఇక ఈ రోజు జాతరలో భాగంగా అసలు ఘట్టం జరగనుంది.
పతాక స్థాయికి చేరుకోనున్న మేడారం మహా జాతర
ఇవాళ సమ్మక్కఆగమనంతో జాతర పతాకస్థాయికి చేరుకోనుంది. నేడు గిరిజనుల ఇలవేల్పు సమక్క గద్దెలకు చేరనుంది. ఆ తల్లి ఆగమనం చూసేందుకు మేడారంలో భక్తజనకోటి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గిరిజన పూజారులు ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం గద్దెపైకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. సమ్మక్క కోరి కొలిచిన వారి కొంగు బంగారం ఆ తల్లి .
అధికార లాంచనాలతో, గిరిజన సంప్రదాయాలతో గద్దె మీదకు సమ్మక్క
కాకతీయ రాజులను ఎదిరించి నిలిచిన ధీశాలి. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా పోరాటం సాగించిన అడవి బిడ్డ . శౌర్యపరాక్రమాలకు నిలువెత్తు రూపం అయిన ఆ తల్లి సమ్మక్క ప్రతిరూపంగా భావించే కుంకుమభరిణెను నేడు చిలకలగుట్ట నుండి అధికార లాంచనాలతో, గిరిజన సంప్రదాయాలతో గద్దె మీదకు తీసుకురానున్నారు. కాకతీయ రాజులతో పోరాడి వీరమరణం పొందినప్పటికీ తన వాళ్లను ఆశీర్వదించేందుకు రెండేళ్లకోమారు జనబాహుళ్యంలోకి వచ్చే సమ్మక్క తన బిడ్డలను చల్లగా కతాక్షించే శుభ ఘడియ ఈ రోజే రానుంది.
సమ్మక్క నామస్మరణతో ప్రతిధ్వనిస్తున్న వనాలు
శతాబ్దాలుగా తనను నమ్మిన భక్తులకు వరాలిచ్చే తల్లిగా భాసిల్లుతున్న సమ్మక్క ఆశీర్వాదం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. తల్లీ బిడ్డలు ఒకచోట చేరి కనికరించే శుభ ఘడియ కోసం నిరీక్షిస్తున్నారు.సమ్మక్క గద్దెపైకి వచ్చే ఆ మధుర క్షణాల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. సమ్మక్క నామస్మరణతో కొండలు, గుట్టలు ప్రతిధ్వనించనున్నాయి. ఇక సమ్మక్క ఆగమనం ఎలా సాగుతుందంటే
ఉదయం నుండే పూజలు .. సాయంత్రం చిలకలగుట్ట నుండి సమ్మక్క ఆగమనం
సమ్మక్క పూజారులు చందా బాబురావు, సిద్ధబోయిన ముణిందర్, మహేశ్, లక్ష్మణ్రావు, కొక్కెర కృష్ణయ్య ఆధ్వర్యంలో వడ్దెలు నేడు ఉదయం వేకువజామునే మేడారంలోని సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అందరూ కలిసి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి కంకవనాన్ని డప్పు చప్పుళ్లతో తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. గద్దెను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. ఆ తర్వాత వారు చిలకలగుట్టకు వెళ్తారు.
గాల్లోకి కాల్పులు జరిపి తల్లికి అధికారుల స్వాగతం
సమ్మక్క రాక సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సైతం అంతా చిలకలగుట్ట వద్దనే వేచి ఉంటారు . సమ్మక్క ఆగమనం కోసం నిరీక్షిస్తుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క పూజారులు కుంకుమ భరిణెను తీసుకొని కిందకు వస్తున్న సమయంలో జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఆ తుపాకీ శబ్దాలే సమ్మక్క ఆగమనానికి సంకేతం. ఇక ఆ క్షణం నుంచి ప్రతి ఘడియా అద్భుతంగా తోస్తుంది . దారికి ఇరువైపులా రంగు రంగుల ముగ్గులు వేసి తల్లికి స్వాగతం చెప్తారు. ఎదురుకోళ్లు , శివసత్తుల చిందులు, పూనకాలతో మేడారంలో ఆ తల్లిని ఆహ్వానిస్తూ ఆవాహనం చేసుకుంటారు భక్తులు .
గద్దెలపై సమ్మక్క ఆగమనం .. పున్నమి వేళ మహాద్భుతం
భారీ బందోబస్తు మధ్య గద్దెల ప్రాంగణానికి పూజారులు ప్రయాణమవుతారు. రోడ్డుకు ఇరువైపులా లక్షలాది మంది భక్తజనసందోహం.. ఇసుకేస్తే రాలనంత జనం.. ఆ ఘట్టం చూడటానికి రెండు కళ్ళు చాలవు . ఆ తల్లిని గద్దెల వద్దకు చేర్చే ముందు జయజయ ధ్వానాల నడుమ తొలుత చలపయ్య చెట్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ పూజలు చేసిన అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. అప్పుడే నిండు జాతరగా మారుతుంది. నిండు పున్నమి వేళ జాబిలమ్మగా సమ్మక్క దర్శనం ఇస్తుంది . ఆ మరుక్షణం నుంచి మొక్కుల చెల్లింపులు ప్రారంభమవుతాయి. తల్లి మనసారా ఇచ్చే ఆశీర్వాదాల కోసం నేడు భక్త జనం పోటెత్తుతుంది.