సండ్ర బెయిల్ షరతుల సడలింపు: సెబాస్టియన్, మత్తయ్యల వాయిస్ శాంపిల్స్
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశానికి హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ తెలగాణ శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్టు సభ్యుడు సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు బుధవారం అనుమతించింది.
దీంతో గురు, శుక్రవారాల్లో తిరుపతిలో జరుగనున్న సమావేశాలకు సండ్ర హాజరుకానున్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టయిన సండ్రకు బెయిల్ మంజూరు సమయంలో నియోజక వర్గం విడిచి వెళ్లరాదంటూ కోర్టు షరతులు విధించిన విషయం తెలిసిందే.
ఓటుకు నోటు కేసులో నిందితులు సెబాస్టియన్, మత్తయ్యల వాయిస్ శాంపిళ్లను టీవీ చానళ్ల నుంచి సేకరించిన ఏసీబీ అధికారులు బుధవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో సమర్పించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు వారిద్దరి ఇంటర్వ్యూ టేపులు ఇవ్వాలని కోరుతూ సంబంధిత టీవీ చానళ్ల యాజమాన్యాలకు లేఖలు రాశారు.
ఆ సీడీలను ఎఫ్ఎస్ఎల్కి పంపించేందుకు అనుమతించాలని కోరుతూ ఏసీబీ అధికారులు బుధవారం కోర్టుకు సమర్పించారు. తాజాగా, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి తెలంగాణ ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.