టీఎస్ఆర్టీసీ సంక్రాంతి ఆఫర్: టికెట్లు బుక్ చేసుకుంటే ప్రయాణాలపై 10 శాతం డిస్కౌంట్
హైదరాబాద్: సంక్రాంతి పండగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మరో శుభవార్త అందించింది. నిన్నమొన్నటి వరకు పండగలు వచ్చాయంటే ప్రత్యేకం అంటూ ఛార్జీలు వసూలు చేసిన ఆర్టీసీ.. ఇప్పుడు కొంత రాయితీని అందించేందుకు ముందుకు వచ్చింది.
సంక్రాంతి పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు రానూపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే.. 10 శాతం రాయితీ కల్పిస్తోంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఒక ప్రకటనల విడుదల చేసింది. అయితే, ఈ రాయితీ తిరుగు ప్రయాణంపై మాత్రమే వర్తిస్తుంది.

డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ బుకింగ్ కి ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. 2023 జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. రాయితీ సదుపాయం తక్షణమే అందుబాటులోకి వస్తుందని, టికెట్లు రిజర్వేషన్ కోసం www.tsrtconline.in వెబ్సైట్ ద్వారా గానీ, యాప్లో గానీ సంప్రదించాలని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ఓ ప్రకటనలో సూచించారు.

సంక్రాంతి పండగ సందర్బంగా ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ప్రకటించాలని సంస్థ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ రాయితీ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని వారు సూచించారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ 10 శాతం బస్సులను అదనంగా నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ మొత్తం 4,233 బస్సు సర్వీసుల్లో.. అమలాపురంకు 125, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నంకు 65, పోలవరానికి 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్ను 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచామని, వచ్చే ఏడాది జూన్ వరకు అందుబాటులో ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.












Click it and Unblock the Notifications