సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? ఇలా చేయండి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు..
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ ఖాళీ అవుతోంది. నగరంలోని ప్రజలంతా సొంతూళ్ల బాట పట్టారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి పండగకు ఈ నెల 10 నుంచి 18 వరకు సెలవులు ప్రకటించారు. దాంతో నగర ప్రజలు సొంతూళ్లకు వెళ్లడం లేదా విహారయాత్రలకు వెళ్తున్నారు. అయితే చోరీల సీజన్ కూడా ఇదే కావడంతో పోలీసులు తగు జాగ్రత్తలు చెబుతున్నారు. ఇళ్లకు తాళం వేసి వెళ్లే ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు జరుగుతున్న క్రమంలో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక సూచనలు చేశారు.
సంక్రాంతి పండగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ఈ సీజన్ లో చోరీలు అధికంగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటి భద్రత మరువొద్దంటూ పలు సూచనలు చేశారు. పండగ వేళ దొంగల కన్ను తాళం వేసిన ఇళ్లపైనే ఉంటుందన్నారు. నగదు, ఆభరణాలు బ్యాంక్ లాకర్లలో దాచుకోవాలన్నారు. అలాగే సోషల్ మీడియాలో ట్రావెల్ అప్ డేట్స్ పెట్టొద్దని సూచించారు. ఎక్కువ రోజులపాటు సొంతూళ్లకు వెళ్లేవాళ్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఏదైనా అనుమానం వస్తే డయల్ 100 కి కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు.
"సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఇంటి భద్రత మరువకండి! పండుగ వేళ దొంగల కన్ను తాళం వేసిన ఇళ్లపైనే ఉంటుంది. నగదు, ఆభరణాలు బ్యాంక్ లాకర్లలో దాచుకోండి. సోషల్ మీడియాలో ట్రావెల్ అప్డేట్స్ పెట్టకండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. అనుమానం వస్తే డయల్ 100 కి కాల్ చేయండి... మీ భద్రతే మా బాధ్యత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!" అని సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

మరోవైపు సంక్రాంతి పండగకు నగరంలోని ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్న క్రమంలో రహదారులపై రద్దీ పెరిగింది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ గంటగంటకూ పెరుగుతోంది. మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. రేపు, ఎల్లుండి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications