సంస్కృత భాషా కోవిదుడు పుల్లెల రామచంద్రుడు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సంస్కృత భాషా కోవిదుడు పుల్లెల శ్రీరామచంద్రుడు (88) తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని బంజారాహిల్స్లో గల స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందు తూ బుధవారం సాయంత్రం కన్నుమూశారు.
శ్రీరామచంద్రుడికి భార్య సుబ్బలక్ష్మి, కుమారుడు సత్యనారాయణశాస్త్రి, కూతురు సత్యవతి ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీరామచంద్రుడు మృతికి సీఎం కేసీఆర్, పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కృత విభాగానికి అధిపతి, సంస్కృత అకాడమీ డైరెక్టర్, సంస్కృత భాషా ప్రచార సమితి అధ్యక్షుడిగా పుల్లెల శ్రీరామచంద్రుడు పనిచేశారు.
సంస్కృతంలో వాల్మికీ రాసిన రామాయణాన్ని తెలుగులోకి అనువదించారు. ఆయన 200 పుస్తకాలకు పైగా రచించారు. సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2011లో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. రాష్టపతి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఐనవోలు మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన శ్రీరామచంద్రుడు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసి పదవీ విరమణ చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సంస్కృత విభాగ అభివృద్ధికి కృషి చేయడంతోపాటు దాదాపు దశాబ్దానికిపైగా ఆ శాఖకు సేవలందించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు మృతి పట్ల జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సీ నారాయణరెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
సంస్కృత, భాషా సాహిత్య సముద్రాన్ని మదించి తెలుగువారికి అనర్ఘ రత్నాలను అందించిన భగీరథుడు పుల్లెల శ్రీరామచంద్రుడు అని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అభివర్ణించారు. సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని తెలుగువారికి అందించారని ఆయన గుర్తు చేశారు. సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలకుగాను తెలుగువర్సిటీ గౌరవ డాక్టరేట్, ఉత్తమ సంస్కృత పండిత పురస్కారంతో సత్కరించుకున్నదని ఆయన గుర్తు చేశారు.