పుట్టినరోజే విగతజీవిగా చిన్నారి హాసిని.. సత్యసాయి జిల్లా రోడ్డుప్రమాదం కొనసాగిస్తున్న విషాదం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లె మండలం పర్వత దేవరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఒ సాఫ్ట్ వేర్ దంపతుల కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఘటన అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి హాసిని పుట్టినరోజు నాడే విగతజీవిగా మారింది.

మొదటి పుట్టినరోజు నాడే విగతజీవిగా హాసిని
ఎంతో సంతోషంగా ఏడాది కూతురు హాసిని పుట్టినరోజు చేయాలని వరంగల్ నగరానికి వస్తున్న కుటుంబ సభ్యులు ముగ్గురు నవంబర్ 19వ తేదీన జరిగిన దారుణ రోడ్డు ప్రమాద ఘటనలో మృత్యువాత పడ్డారు. కారు కల్వర్టును ఢీకొన్న ఘటనలో హాసిని తల్లిదండ్రులు రమ్య, గోపీనాథ్ సంఘటన స్థలంలోనే మృతిచెందగా, గోపీనాథ్ తల్లి తారకేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం నాడు జరిగిన ఈ దారుణ ఘటనకు కొనసాగింపుగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న హాసిని తన పుట్టిన రోజు నాడే విగతజీవిగా మారింది.

సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనలో తీవ్రగాయాలతో హాసిని
కారు కల్వర్టును ఢీకొని భార్యాభర్తలు రమ్య, గోపీనాథ్,గోపీనాథ్ తల్లి తారకేశ్వరి మృతిచెందగా 5 సంవత్సరాల వయసున్న సాహిత్, ఏడాది కూతురు హాసిని ప్రాణాలతో బయట పడ్డారు.తీవ్ర గాయాలపాలైన వారిని మొదట సత్యసాయి జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత వారిని బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. అప్పటినుండి బెంగళూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అన్నా చెల్లెళ్ళు ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది.

నేడు తల్లిదండ్రులు బ్రతికుంటే పుట్టినరోజు వేడుకలు .. కానీ విధి ఇలా..
గురువారం నాడు రాత్రి ఏడాది వయసున్న హాసిని కూడా కన్నుమూసింది. తల్లిదండ్రులు లేని జీవితం నాకు అవసరం లేదు అనుకుందో ఏమో చావుతో పోరాడటంలో విఫలమైంది. సరిగ్గా నేడు తల్లిదండ్రులు బతికుంటే అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన హాసిని, పుట్టినరోజు నాడే విగతజీవిగా మారింది. పుట్టినరోజు నాడే హాసిని అంత్యక్రియలు చేయాల్సి రావడంతో బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సంతోషంగా అమ్మా నాన్నలతో బ్రతకాల్సిన హాసినికుటుంబాన్ని విధి పరిహసించింది. కానిరాని లోకాలకు తీసుకువెళ్ళింది.

నేడు హాసినికి అంత్యక్రియలు.. సాహిత్ పరిస్థితి విషమం
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో, వారంతా వరంగల్ కు చెందిన వారు కావడంతో వరంగల్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే మరణించిన ముగ్గురి మృతదేహాలకు గత ఆదివారం నాడు వరంగల్ నగరంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక తాజాగా హాసిని కూడా మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది. ఇక ఆ కుటుంబంలో ప్రస్తుతం వైద్యం తీసుకుంటున్న కుమారుడు సాహిత్ పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్టు బంధువులు తెలిపారు. కనీసం సాహిత్ అయినా దక్కుతాడా లేదా అన్న ఆందోళనలో బంధువులు ఉన్నారు.












Click it and Unblock the Notifications