ఇదేం న్యాయం! నిబంధనలు బేఖాతర్..: ఒకే రోజు రూ.1.20కోట్లు విత్ డ్రా
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను పక్కనబెట్టేసి.. విజయ డెయిరీ ఖాతా నుంచి రూ.1.2కోట్ల విత్ డ్రాకు అనుమతించారు మెదక్ ఎస్.బి.హెచ్. మామూలుగా అయితే ప్రభుత్వ నిబంధన ప్రకారం.. ఒక రోజులో ఒక వ్యక్తి ఖాతా న
మెదక్ : ఓవైపు నోట్ల రద్దుతో సామాన్యులంతా ఇబ్బందులు పడుతుంటే.. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బ్యాంకులు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి.. నగదు కోసం సామాన్యులంతా అష్టకష్టాలు పడుతున్న తరుణంలో.. ఒకే ఖాతా నుంచి రూ.1.2కోట్లు విత్ డ్రా అవకాశం కల్పించడం పట్ల మెదక్ ఎస్.బి.హెచ్ యాజమాన్యంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను పక్కనబెట్టేసి.. విజయ డెయిరీ ఖాతా నుంచి రూ.1.2కోట్ల విత్ డ్రాకు అనుమతించారు మెదక్ ఎస్.బి.హెచ్. మామూలుగా అయితే ప్రభుత్వ నిబంధన ప్రకారం.. ఒక రోజులో ఒక వ్యక్తి ఖాతా నుంచి గరిష్టంగా రూ.10వేలకు మించి విత్ డ్రా అవకాశం లేదు. అలాంటప్పుడు.. విజయ డెయిరీ కోసం ఎస్.బి.హెచ్ అధికారులు నిబంధనలను ఎందుకు పక్కనబెట్టారన్నది తేలాల్సి ఉంది.
నవంబర్ 11వ తేదీన మెదక్ పట్టణంలో ఉన్న ఎస్.బి.హెచ్ బ్రాంచ్ నుంచి ఈ భారీ లావాదేవీ జరిగింది. రూ.1.2కోట్లను తమ ఖాతా నుంచి విత్ డ్రా చేసుకున్నట్టు విజయ డెయిరీ మేనేజర్ రంజిత్ స్వయంగా వెల్లడించారు. ఒకవేళ ఇంత భారీ మొత్తాన్ని పాడి రైతుల బకాయిలు చెల్లించారా అంటే.. చెల్లించలేదన్న సమాధానమే వినిపిస్తోంది. మరోవైపు బ్యాంకు ఖాతాల ద్వారా భారీ మొత్తంలో డబ్బులను చెల్లించరాదని నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే.
సుమారు 13 సొసైటీ చెక్కులతో విజయ డెయిరీకి చెందిన (ఎండీటీఎస్డీడీసీఎఫ్ లిమిటెడ్- 0000006221219 2509)ఖాతా నుంచి ఈ భారీ నగదును విత్ డ్రా చేశారు. ఇందులో అధిక శాతం రూ.2వేల నోట్లే ఉన్నట్టు సమాచారం. ఓవైపు సామాన్యులంతా బ్యాంకు ముందు బారులు తీరితే.. ఇలా విజయ డెయిరీ కోసం నిబంధనలను పక్కనబెట్టేసి మరీ ఎస్.బి.హచ్ బ్యాంకు అధికారులు పెద్ద మొత్తంలో విత్ డ్రా అవకాశం కల్పించడం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక మెదక్ కు పొరుగునే ఉన్న సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని విజయ సొసైటీ సభ్యులకు మాత్రం బ్యాంకు అధికారులు విత్ డ్రా అనుమతి కల్పించకపోవడం గమనార్హం. ఏదేమైనా మెదక్ ఎస్.బి.హెచ్ అధికారుల చర్యపై అవినీతి ఆరోపణలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. బ్లాక్ ను వైట్ గా మార్చే క్రమంలోనే ఇంత భారీ మొత్తంలో విత్ డ్రాకు అనుమతి ఇచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు.