ఎస్బీఐ ‘హిడెన్’ ఛార్జీల మోసం: వసూళ్లపై కేసు నమోదు
హైదరాబాద్: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) హిడెన్ ఛార్జీల పేరుతో తన వినియోగదారులను భారీగా మోసం చేస్తున్నట్లు తెలిసింది.
అసలు డబ్బులు ఎందుకు కట్ చేస్తున్నారో కూడా తెలియకుండా వినియోగదారుల అకౌంట్లలో నుంచి డబ్బులు కట్ చేస్తూ.. అడిగిన వారితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఓ బాధితుడు ఆరోపించాడు.
రూ.150 కట్
ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల కృష్ణ మోహన్ శర్మ అనే వ్యక్తి ఖాతాలో నుంచి 150 రూపాయలు కట్ అయినట్లు ఫోన్కు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే అనుమానం వచ్చిన కృష్ణ మోహన్ శర్మ, తన ఖాతా ఉన్న ఎస్బీఐ బ్యాంకు ఏ.ఎస్.రావు నగర్ బ్రాంచ్కి వెళ్లి వివరణ కోరాడు. కానీ బ్యాంకు అధికారులు అతనికి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
స్టేట్ తీసుకోకపోయినా కట్ చేశారు..
దీంతో ఈ విషయంపై వెంటనే కృష్ణ మోహన్ శర్మ ‘బ్యాంకింగ్ అంబుడ్స్మెన్'కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన బ్యాంక్ అధికారులు అకౌంట్ స్టేట్మెంట్ కోసం 150 రూపాయలు కట్ చేసినట్లు తెలిపారు. అసలు బ్యాంకు స్టేట్మెంట్ తీసుకోలేదని.. ఆ సమయంలో బ్యాంకులోనే లేనని.. అయినా అధికారులు డబ్బులు కట్ చేశారని మోహన్ శర్మ వాపోయాడు.
న్యాయం జరగలేదు..
కాగా, బ్యాంకు అధికారుల తీరును రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లిన్నా.. అతడికి న్యాయం మాత్రం జరుగలేదు. అయితే పట్టువదలని కృష్ణ మోహన్ కోర్టును ఆశ్రయించాడు. హిడెన్ ఛార్జీల రూపంలో అర్థం పర్థం లేని చార్జీలను కస్టమర్ల అకౌంట్ల నుండి కట్ చేస్తున్నారని వాపోయాడు.
కేసు నమోదుకు ఆదేశం
అంతేగాక, ఇది తన ఒక్కడి సమస్య కాదని ప్రతి వినియోగదారుడికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతున్నాయని తన ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఈ విషయంపై స్పందించిన కోర్టు వెంటనే ఎస్బీఐ బ్యాంక్ ఏఎస్రావు నగర్ బ్రాంచ్ అధికారులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని కుషాయిగూడ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.