కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలో మళ్లీ స్కూళ్లు బంద్... అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి...
కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం(మార్చి 24) నుంచి రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు మూసివేయాల్సిందేనని తెలిపింది. వైద్య కళాశాలలు మినహా అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు.
కొనసాగనున్న ఆన్లైన్ క్లాసులు...
రాష్ట్రంలోని పలు స్కూళ్లలో కరోనా కేసులు నమోదవడంతో... వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగానే స్కూళ్లను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్కూళ్లను మూసివేయాలని తల్లిదండ్రుల నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చాయన్నారు. స్కూళ్లలో బోధనా,బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి కాబట్టి.. కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణా తరగతులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
కేసీఆర్తో చర్చించాక అసెంబ్లీలో ప్రకటన...
ఇప్పటికే ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,పంజాబ్,చత్తీస్గఢ్,మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ స్కూళ్లు మూతపడ్డాయని గుర్తుచేశారు. ప్రజలంతా కరోనా కట్టడి చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తప్పనిసరిగా ముఖానికి మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం చేయాలన్నారు. అసెంబ్లీలో ప్రకటనకు ముందు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమై స్కూళ్ల మూసివేత అంశంపై చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రేపటి నుంచి స్కూళ్లను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. స్కూళ్ల మూసివేత అంశంపై గత కొద్దిరోజులుగా ప్రభుత్వం అధికారులతో సమాలోచనలు జరుపుతోంది. వైద్యశాఖ చేసిన సిఫార్సుపై చర్చించిన అనంతరం.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫిబ్రవరిలో తెరుచుకున్న స్కూళ్లు.. ఇంతలోనే బంద్..
కోవిడ్ 19 నిబంధనల సడలింపు తర్వాత ఫిబ్రవరిలో తెలంగాణలో మళ్లీ స్కూళ్లు తెరుచుకున్న సంగతి తెలిసిందే. మొదట కేవలం 9,10 తరగతులకు మాత్రమే క్లాసులు నిర్వహించారు. ఆ తర్వాత 6,7,8 తరగతులకు కూడా ప్రత్యక్ష విద్యా బోధన చేపట్టారు. అయితే ఇటీవల పలు స్కూళ్లు,హాస్టళ్లలో పెద్ద ఎత్తున విద్యార్థులు కరోనా బారినపడుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కొద్ది కాలం పాటు స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించింది.