దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు - రూట్లు ఖరారు..!!
పండుగల వేళ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న రద్దీతో ప్రయాణీకుల సౌకర్యార్ధం 1400 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్, నవంబర్ నెలలలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాలకు రిజర్వేషన్లు నో రూమ్ చూపిస్తున్నాయి. దీంతో..ఈ రెండు పండుగల వేళ ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
పండుగల వేళ
దసరా, దీపావళి వేళ రైళ్లన్నీ రద్దీగా మారాయి. సొంత ప్రాంతాలకు వెళ్లి వచ్చే వారి రాకపోకలతో రైళ్లల్లో ఖాళీలు లేవు. ప్రయివేటు బస్సులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో, దక్షిణ మధ్య రైల్వే ఎక్కువగా రద్దీ ఉన్న మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇందు కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఉత్తర భారత రాష్ట్రాలైన బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాలకు కూడా ప్రయాణించడానికి అధిక డిమాండ్ ఉన్న దృష్ట్యా ఎక్కువ రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

1400 ప్రత్యేక రైళ్లు
ప్రస్తుతం ఈ రైళ్లు అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడపుతున్నట్లు తెలిపారు. ప్రజల పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి రాబోయే రోజుల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించాలని దక్షిణ మధ్య రైల్వే డిసైడ్ అయింది. అదే సమయంలో ఈ రైళ్ల కోసం ఉన్న డిమాండ్ ను గుర్తించి ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రిజర్వ్ చేయని కోచ్ల ద్వారా ప్రయాణించాలనుకునే వారి కోసం జనరల్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడకుండా తమ టిక్కెట్లను మొబైల్ యాప్లో యూటీఎస్ ద్వారా కొనుగోలు చేసుకొనే అవకాశం కల్పించారు.
ప్రయాణీకుల రద్దీ
పండుగ సెలవులతో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వెయిటింగ్ లిస్ట్ వందల సంఖ్యలో దర్శనమిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రైళ్లలో నిలబడి వెళ్లేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నారు. అదనపు రైళ్లు ఏర్పాటు చేసినా ప్రయాణీకులకు వాటి పైన పూర్తి సమాచారం ఉండటం లేదు. ఇక, ప్రధాన రైళ్లల్లో జనరల్ బోగీల్లోకి కనీసం వెళ్లే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో, ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వరుసగా వస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకొని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పండుగల సమయంలో భారీగా ప్రత్యేక రైళ్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications